నవలా చిత్రం 'గిరిజా కళ్యాణం'కి 40 ఏళ్ళు!
on Oct 16, 2021
తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో నటభూషణ శోభన్ బాబు, అందాల తార జయప్రద జోడీ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో `గిరిజా కళ్యాణం` ఒకటి. యద్దనపూడి సులోచనా రాణి రచించిన `గిరిజా కళ్యాణం` నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాని కె.ఎస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేశారు. డి.వి. నరసరాజు తెరానువాదం చేసిన ఈ చిత్రంలో సుమలత, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, త్యాగరాజు, సారథి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. సుభాషిణి, గీత ప్రత్యేక గీతాల్లో దర్శనమిచ్చారు.
సత్యం బాణీలు అందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, గోపీ సాహిత్యమందించారు. ``యవ్వనం``, ``కౌగిలి ఇది``, ``డిస్కో నా రాజా``.. అంటూ సాగే గీతాలు అప్పటి ప్రేక్షకులను అలరించాయి. నవల స్థాయిలో ఈ సినిమా రంజింపజేయకపోయినా.. శోభన్ బాబు అభిమానులను కొంతమేర ఆకట్టుగోలిగిందీ చిత్రం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కింగ్ నాగార్జున టైటిల్ రోల్ లో నటించిన `మన్మథుడు`లోనూ ఈ నవల ఛాయలు ఉంటాయి. సుందర్ లాల్ నహతా సమర్పణలో శ్రీకాంత్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ నహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1981 అక్టోబర్ 16న విడుదలైన `గిరిజా కళ్యాణం`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.