30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈవీవీ 'ఆ ఒక్కటీ అడక్కు'
on Sep 19, 2022
ఆరోగ్యవంతమైన హాస్యాన్ని అందించడంలో దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దిట్ట. ఆయన కేరీర్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రం ఒకటి. రాజేంద్ర ప్రసాద్, రంభ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19, 1992న విడుదలై హాస్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై 30 ఏళ్ళు పూర్తయింది.
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఏ పని చేయకుండా, తనకు త్వరలో రాజయోగం పడుతుందని జాతకాన్ని నమ్ముకొని బతికే చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. అలాంటి చిట్టిబాబు కిందిస్థాయి నుంచి ఎదిగి కోటీశ్వరుడైన రొయ్యల నాయుడు(రావు గోపాల్ రావు) కూతురు రంభతో ప్రేమలో పడతాడు. అయితే కష్టపడి లక్ష రూపాయలు సంపాదిస్తేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని రొయ్యల నాయుడు షరతు పెడతాడు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, రావు గోపాల్ రావు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివరికి చిట్టిబాబు అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకోవాలని గ్రహిస్తాడు. ఈ సినిమాకి పి. కలైమణి కథ అందించగా, ఎల్బీ శ్రీరామ్ సంభాషణలు రాశారు. రాజేంద్ర ప్రసాద్ పలికిన "after one year i will be king" వంటి డైలాగ్స్ అప్పట్లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సీన్స్ నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 'మా మేక మాట్లాడుతుంది' అంటూ 'ఇది ఏ నెల' అని అడిగి దానితో 'మే' అని చెప్పించే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఆయన స్వరపరిచిన ఆరు పాటల్లో 'రాజాధి రాజాను' పాటకు భువన చంద్ర సాహిత్యం అందించగా.. మిగతా ఐదు పాటలు 'కో కో కోన కోన', 'వారేవా మానవ', 'అమ్మోమ్మో రాతిరి', 'పావురమా పావురమా', 'అంకులూ దిగి రావేమయ్యో' వేటూరి కలం నుంచి జాలువారాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలను ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ఆలపించడం విశేషం. ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వి. శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ గా కె.రవీంద్ర బాబు వ్యవహరించారు. ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, బాబూ మోహన్, కళ్ళు చిదంబరం, నిర్మలమ్మ, సాక్షి రంగారావు తదితరులు నటించారు.
Also Read