ఆ కల్ట్ క్లాసిక్కు పాతికేళ్లు నిండాయి!
on Oct 20, 2020
ఆ సినిమా కథ కొత్తదేమీ కాదు.. సినిమా పుట్టినప్పట్నుంచీ ఆ తరహా కథలు ఎన్ని తెరమీదకు వచ్చాయో లెక్క లేదు. అయితేనేం.. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (డీడీఎల్జే) సినిమా కాలానికి తట్టుకొని నిలబడి, కల్ట్ క్లాసిక్గా చరిత్రకెక్కింది. అది డైరెక్టర్గా ఆదిత్య చోప్రాకు ఫస్ట్ ఫిల్మ్ అంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజం. అప్పటికే 'బాజీగర్' మూవీతో మంచి పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్, కాజోల్ జోడీ ఈ సినిమాతో మోస్ట్ ఐకనిక్ పెయిర్ ఆఫ్ డికేడ్గా నిలవడమే కాదు, ఆ తర్వాత కాలంలోనూ వారి జోడీకి తిరుగులేనంతగా ఖ్యాతి తెచ్చుకుంది.
'డీడీఎల్జే' కథేమిటంటే.. సిమ్రన్, రాజ్ అనే ఇద్దరు యువతీ యువకులు యూరప్ టూర్లో ఒకరికొకరు తారసపడి, స్నేహితులై ప్రేమికులుగా మారతారు. అయితే అప్పటికే సిమ్రన్ పెళ్లి వేరొకరితో నిశ్చయమైందని తెలుస్తుంది రాజ్కు. ఇండియాకు ఆమెతో పాటు వచ్చిన రాజ్.. ఆమె తండ్రి మనసును కూడా గెలుచుకొని సిమ్రన్ను చేపడతాడు. ఎంతటి ఓల్డ్ స్టోరీ!
యశ్ చోప్రా సినిమా 'డర్'లో విలన్గా నటించి అదరగొట్టిన షారుఖ్ 'డీడీఎల్జే' చిత్రంతో బాలీవుడ్ సరికొత్త రొమాంటిక్ హీరోగా అవతరించాడు. రాజ్ క్యారెక్టర్లో సెల్యులాయిడ్పై అల్టిమేట్ చార్మర్ అనిపించుకున్నాడు. ఇక సిమ్రాన్ లాంటి కథ కావాలని ప్రతి అమ్మాయి అనుకొనేలా కాజోల్ పోషించిన క్యారెక్టర్ను మలిచాడు ఆదిత్య చోప్రా. పితృస్వామ్యం పడగ నీడ నుంచి బయటపడి స్వేచ్ఛ కోసం, తన అస్తిత్వాన్ని అన్వేషించుకోవడం కోసం తపనపడే అమ్మాయి సిమ్రన్గా కాజోల్ నట విన్యాసాల్ని మరవగలమా!
'డీడీఎల్జే' తర్వాత ప్రేక్షకులు షారుఖ్, కాజోల్ జంటనే కాకుండా, విడివిడిగానూ వారిని అపూర్వంగా ఆదరించారు. కాజోల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదగగా, షారుఖ్ బాలీవుడ్ బాద్షా అనే పేరు తెచ్చుకున్నాడు. వారి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వచ్చాయి. అలాంటి 'డీడీఎల్జే' విడుదలై నేటి (అక్టోబర్ 20)కి పాతికేళ్లు నిండాయి.
ఈ సందర్భంగా కాజోల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ సినిమాకు ట్రిబ్యూట్ సమర్పించింది. తన ట్విట్టర్ హ్యాండిల్కు సిమ్రన్ అనే పేరు పెట్టిన ఆమె, "రాజ్ అండ్ సిమ్రన్! ఇద్దరు వ్యక్తులు, ఒక ఫిల్మ్, 25 సంవత్సరాలు, ప్రేమ ఆగకుండా కురుస్తూనే ఉంది! ఇవాళ అది ఒక ఫినామినాగా, తనదైన చరిత్రలో భాగంగా నిలవడానికి కారకులైన వ్యక్తులందరికీ నేను నిజంగా రుణపడి ఉంటాను. ఫ్యాన్స్! మీ అందరికీ బిగ్ షౌటవుట్" అని ఆమె ట్వీట్ చేసింది.
Also Read