2019 టాలీవుడ్: 5 స్టన్నింగ్ ఫాక్ట్స్
on Jan 2, 2020
టాలీవుడ్ హిస్టరీలో 2019 అనేది ఒక ప్రముఖ సంవత్సరం. 'బాహుబలి' పుణ్యమా అని తెలుగు సినిమా మార్కెట్ పరిధి బాగా విస్తరించిందని 'సాహో', 'సైరా' సినిమాలు తెలియజేశాయి. హిందీలోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ ఈ సినిమాలు విడుదలయ్యాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్తో పాటు బయోపిక్స్, థ్రిల్లర్స్, గుడ్ కంటెంట్ ఫిలిమ్స్ ఈ సంవత్సరం బాగానే వచ్చాయి. వాటితో పాటు కొన్ని అడల్ట్ కంటెంట్ మూవీస్ కూడా వచ్చాయనుకోండి.
సినిమా లవర్స్గా మంచి స్టోరీ ఉన్న సినిమాలనూ, ఉత్కంఠ కలిగించిన కథనాలననూ మనం ఇష్టపడ్డాం. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చించాం. అయితే ఆ సినిమాల వెనుక కూడా ఆసక్తికర కథలేన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నిజాల్ని చెప్పుకుందాం...
మాసివ్ బడ్జెట్ మూవీస్
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా 'సాహో', మెగాస్టార్ చిరంజీవి మూవీ 'సైరా' సినిమాలు 2019లో అత్యధిక బడ్జెట్తో తయారైన సినిమాలుగా నిలిచాయి. తెలుగు అనేది ఒక ప్రాంతీయ భాష అయినప్పటికీ 'బాహుబలి' ఇచ్చిన స్ఫూర్తితో ఈ సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకాడలేదు. సుజిత్ డైరెక్ట్ చేసిన 'సాహో' సినిమాకి యువీ క్రియేషన్స్ అధినేతలు ఏకంగా 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా, సురేందర్ రెడ్డి రూపొందించిన కాస్ట్యూం డ్రామా 'సైరా' కోసం నిర్మాత రాంచరణ్ 280 కోట్లను వెచ్చించారు. దురదృష్టమేమంటే.. ఈ రెండు సినిమాల తెలుగు వెర్షన్లూ హిట్ అనిపించుకోలేకపోయాయి.
బయోపిక్స్ జాతర
గతంలో ఎన్నడూ లేనన్ని బయోపిక్స్ 2019లో వచ్చాయి. మహానటుడు ఎన్టీఆర్ నుంచి మొదలుకొని తెలుగు సినిమా పితామహునిగా పేరుపొందిన రఘుపతి వెంకయ్యనాయుడు వరకు 8 బయోపిక్స్ రావడం విశేషం. వాటిలో ఎన్టీఆర్పై తీసినవే మూడు సినిమాలు కావడం విశేషం. ఎన్టీఆర్ నట జీవితంపై 'కథానాయకుడు', రాజకీయ జీవితంపై 'మహానాయకుడు' సినిమాలు వచ్చాయి. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాల్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ను స్వయానా ఆయన కుమారుడు బాలకృష్ణ పోషించారు. అలాగే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన రోజుల నుంచి జరిగిన ఘటనలను తన కోణం నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట తీశాడు రాంగోపాల్వర్మ. చేనేత కార్మికురాలైన అమ్మ కోసం ఆసుయంత్రాన్ని చేసిచ్చిన చింతకింది మల్లేశం కథను 'మల్లేశం' పేరుతో రాజ్ రాచకొండ రూపొందించగా, టైటిల్ రోల్ను ప్రియదర్శి పోషించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టమైన పాదయాత్రను ఆధారం చేసుకొని మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర' సినిమాలో రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించాడు.
రేనాటి సూర్యుడిగా పేరుపొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను 'సైరా' పేరుతో సురేందర్రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, నరసింహారెడ్డి క్యారెక్టర్ను చిరంజీవి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, రెబల్గా పేరుపొంది, అదే క్యాంపస్లో హత్యకు గురైన జార్జిరెడ్డి బయోపిక్ అదేపేరుతో వచ్చింది. దీనికి జీవన్రెడ్డి దర్శకుడు కాగా, టైటిల్ రోల్ను సందీప్ మాధవ్ పోషించాడు. తొలి తెలుగు మూకీ సినిమా 'భీష్మ ప్రతిజ్ఞ'ను నిర్మించి తెలుగు సినిమాకు ఆద్యుడైన వ్యక్తిగా కీర్తిపొందిన ' రఘుపతి వెంకయ్యనాయుడు' జీవితం ఆధారం బాబ్జీ డైరెక్షన్లో అదే పేరుతో వచ్చిన సినిమాలో సీనియర్ నరేశ్ టైటిల్ రోల్ చేశారు.
అయితే ఈ బయోపిక్స్లో ఒక్క 'జార్జిరెడ్డి' మాత్రమే కమర్షియల్గా విజయం సాధించగా, మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 'సైరా' సినిమా తెలుగు వెర్షన్ 2019 టాలీవుడ్ టాప్ గ్రాసర్ అయినప్పటికీ బయ్యర్లకు నష్టాలు తేవడం గమనార్హం. 'రఘుపతి వెంకయ్యనాయుడు' సినిమా అయితే నిర్మించిన మూడేళ్లకు విడుదలకు నోచుకున్నా, ఎవరి దృష్టినీ కనీసంగానైనా ఆకట్టుకోలేకపోయింది.
'మహర్షి'కి పెట్టిందే వచ్చింది
సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'మహర్షి' వచ్చింది ఈ ఏడాదే. అంతేకాదు, ఆయనను వందకోట్ల రూపాయల క్లబ్బులో చేర్చింది కూడా ఇదే సినిమా. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 100.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ మూవీ ప్రి బిజినెస్ వాల్యూ 100 కోట్లు. అంటే ఈ సినిమాపై బయ్యర్లు ఎంత పెట్టారో అంత డబ్బు మాత్రమే వచ్చిందన్న మాట. కాకపోతే నిర్మాతలకు మాత్రం అదనంగా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి చాలానే మిగిలింది.
వర్మ సినిమాలకు సెన్సార్ ఇక్కట్లు
రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే వివాదం అక్కడుంటుంది అనే విషయం తెలిసిందే కదా.. ఈసారి ఆ వివాద స్థాయి మరింత పెరిగింది. కారణం.. ఆయన తీసిన రెండు సినిమాలూ సెన్సార్ ఇబ్బందుల్ని ఎదుర్కోవడం. మరీ ముఖ్యంగా డిసెంబర్లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు' సినిమాకైతే టైటిలే మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకు ఆయన మొదట పెట్టిన టైటిల్.. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాని ఆయన తీశాడనే ప్రచారం జోరుగా సాగింది. తన ట్విట్టర్ పేజీలో ఆయన రాతలు కూడా ఇదే విషయన్ని చెప్పాయి. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో, టైటిల్ను 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అని మార్చారు. అయినా కూడా ఈ సినిమా రివైజింగ్ కమీటీదాకా వెళ్లాల్సి వచ్చింది. 16 చోట్ల ఈ సినిమాకు కత్తెరపడినాకే విడుదలైంది. ఇంత వివాదం, ఆసక్తీ రేకెత్తించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర్ బొక్కబోర్లా పడింది.
ఇక ఇదే ఏడాది ప్రథమార్ధంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని తీశాడు వర్మ. ఇది కూడా చంద్రబాబును టార్గెట్ చేసిందే. ఎన్టీఆర్ను ఆయన వెన్నుపోటు పొడిచాడనే విషయాన్ని చెబుతూ, లక్ష్మీపార్వతిని హీరోయిన్గా చూపిస్తూ తీసిన ఈ సినిమా తెలంగాణలో మార్చి నెలలో విడుదల కాగా, కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు పూర్తయ్యాకే విడుదలైంది. ఇది కూడా అంతంత మాత్రంగానే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగింది.
ఐదు ముక్కలైన శర్వానంద్ భుజం ఎముక
ప్రమాదకర సన్నివేశాల్లో బాడీ డబుల్ను ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. అయితే నేటి కాలం హీరోలు రిస్కీ షాట్స్ను కూడా తామే చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. డూప్లను ఉపయోగించి తీయడాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోప్స్ వాడుతున్నా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. కారణం ఏదైనా '96' రీమేక్ ప్రిపరేషన్లో భాగంగా థాయిలాండ్లో స్కై డైవింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న హీరో శర్వానంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని భుజం ఎముక ఏకంగా ఐదు ముక్కలైంది. వెంటనే హైదరాబాద్కు వచ్చేసిన శర్వానంద్కు సన్షైన్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. దీన్నుంచి కోలుకోవడానికి శర్వాకు నాలుగు నెలల సమయం పట్టింది. దిల్ రాజు నిర్మిస్తోన్న '96' రీమేక్లో శర్వానంద్, సమంత క్లాస్మేట్స్గా కనిపించనున్నారు.