వైభవంగా ‘తెలుగువన్’ 24వ వార్షికోత్సవం!
on May 9, 2024
తెలుగు ప్రజలకు నిరంతరాయంగా వినోదాన్ని, సమాచారాన్ని నిర్విరామంగా అందిస్తూ, తెలుగు ప్రజల ఆదరణను, ఆశీస్సులను అందుకుంటోంది తెలుగువన్. ఎంట్రప్రిన్యుర్ క్వాలిటీతోపాటు సృజనాత్మకత కూడా పుష్కలంగా వున్న కంఠంనేని రవిశంకర్ పాతికేళ్ళ క్రితం ‘ఆబ్జెక్ట్ వన్’ సంస్థని స్థాపించారు. ఆబ్జెక్ట్ వన్ సంస్థని స్థాపించిన ఒక ఏడాది తర్వాత తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ‘తెలుగువన్’. వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ రూపాల్లో తెలుగు ప్రజల ముందుకు వచ్చిన ‘తెలుగువన్’ భారతదేశంలో యూట్యూబ్తో కలసి ప్రయాణాన్ని ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ మీడియా నెట్వర్క్గా అభివృద్ధి చెందిన ‘తెలుగువన్’ మొత్తం 350 యూట్యూబ్ ఛానళ్ళతో అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది.
ఇంటర్నెట్ అంటే దేశంలో అందరూ లైట్గా తీసుకుంటున్న సమయంలో, రాబోయే కాలంలో ఈ కొత్త టెక్నాలజీ ఎంతటి విశ్వరూపాన్ని చూపిస్తుందనే భవిష్యత్ దర్శనం చేసిన కంఠంనేని రవిశంకర్ యూట్యూబ్తో కలసి ప్రయాణం ప్రారంభించారు. ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో తెలుగువన్ ఎన్నో సంచలనాలను సృష్టించింది. తెలుగు ప్రజలకు నాణ్యమైన వినోదాన్ని, నికచ్చి అయిన సమాచారాన్ని అందించడంలో నిబద్ధతను ప్రదర్శిస్తూ ముందడుగు వేసింది. ప్రజలకు సమాచారాన్ని, వినోదాన్ని అందించడంలో నైతిక విలువను పాటిస్తూ వచ్చిన సంస్థ తెలుగువన్. తెలుగువన్ స్పూర్తితో ఈ రంగంలోకి వచ్చిన ఎన్నో సంస్థలో ఈ ప్రవాహంలో ఎదురీదలేక ప్రయాణాన్ని ముగించాయి. మరికొన్ని సంస్థలు తమ ఉనికిని నిలుపుకోవడం కోసం అనైతిక ఆకర్షణీయ మార్గాలను అనుసరిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. కానీ ప్రారంభమైన మొదటి రోజు నుంచి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు ‘తెలుగువన్’ది ఒకే మాట.. ఒకే బాట. అదే నైతికత.
తెలుగువన్ చేసిన ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నెన్నో విజయాలు, ఎన్నెన్నో ఎదురురాళ్ళు... విజయాలను ఆస్వాదిస్తూ, ఎదురురాళ్ళను అధిగమిస్తూ మరింత ఉజ్వల భవిష్యత్తువైపు ఆశావాదంతో దూసుకువెళ్తున్న తెలుగువన్ 24వ వార్షికోత్సవం గురువారం (09-05-2024) నాడు సంస్థ కార్యాలయంలో వైభవంగా జరిగింది. మూడు వందల మందికి పైగా సంస్థ ఉద్యోగులు ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్, సంస్థ డైరెక్టర్ శ్రీమతి హిమబిందు కంఠంనేని, కంఠంనేని రవిశంకర్ దంపతుల కుమార్తె డాక్టర్ జితేష్ణ, అల్లుడు సాయిరామ్ పాల్గొన్నారు. ఉద్యోగుల కరతాళధ్వనుల మధ్య వీరు కేక్ కట్ చేసి, తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, పాతికేళ్లుగా ‘ఆబ్జెక్ట్ వన్’, 24 ఏళ్ళుగా ‘తెలుగువన్’ అభివృద్ధి కోసం తనతో కలసి నడుస్తున్న సంస్థ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన వెంట నడచిన ఉద్యోగులకు తానెంతో కృతజ్ఞుడినని అన్నారు. రాబోయే రోజుల్లో ‘తెలుగువన్’ మరింత ఉజ్వల భవిష్యత్తును చూడబోతోందని, ఎన్నెన్నో ఘన విజయాలను సాధించబోతోందని ఆయన చెప్పారు. ‘తెలుగువన్’ నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడంలో సంస్థ ఉద్యోగులు తనకు అందించిన సహకారాన్ని ఎన్నడూ మరువలేనని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు. ‘తెలుగువన్’ను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్ళడానికి తన కుమార్తె డాక్టర్ జితేష్ణ, అల్లుడు సాయిరామ్ ఈ తరపు ఆధునిక ఆలోచనలతో తనకు సహకరిస్తారని, తన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారని కంఠంనేని రవిశంకర్ సంస్థ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.
Also Read