కొంపముంచిన ఫేస్ బుక్ పోస్ట్.. 'బాయ్ కాట్ భైరవం' అంటూ మెగా ఫ్యాన్స్ పిలుపు!
on May 22, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. పైగా 'భైరవం' విజయం అనేది టీం అందరికీ కీలకం. ఇలాంటి టైంలో మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.
సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీ హోదా రాకముందు.. ఎవరైనా స్టార్స్ ని ట్రోల్ చేస్తూ ఏవైనా దారుణ పోస్ట్ లు పెట్టి ఉంటే.. వాటిని డిలీట్ చేయడం మంచిది. అసలు అలాంటి పోస్ట్ లే చేయకపోవడం మరీ మంచిది. కానీ కొందరు తెలిసో తెలియకో ట్రోల్ చేసి.. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయక.. ఇరుకున పడతారు. ఇప్పుడు దర్శకుడు విజయ్ కనకమేడల విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు.
2011 లో చిరంజీవి, రామ్ చరణ్ లను ట్రోల్ చేస్తూ విజయ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. #BoycottBHAIRAVAM హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
మరి ఆ పోస్ట్ నిజంగానే విజయ్ కనకమేడల చేశాడా? లేక ఆయన పేరుతో ఎవరైనా ఫేక్ అకౌంట్ తో చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏదైనా ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ కారణంగా ఇప్పుడు 'భైరవం' సినిమా వివాదంలో చిక్కుకుంది. మరి దీనిపై విజయ్ కనకమేడల ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
