ENGLISH | TELUGU  

మళ్ళీ తెరమీద 'మాయాబజార్'

on May 20, 2025

 

తెలుగు సినిమా రంగంలో నాటికీ నేటికీ ఏనాటికి క్లాసిక్ "మాయాబజార్". ఈ సినిమా విడుదలై నేటికి 68 సంవత్సరాలు. "మాయాబజార్" చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు .

 

ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి 'మాయాబజార్' చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి "మాయాబజార్" చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు.

 

"మాయాబజార్"  సినిమాకు పింగళి నాగేంద్ర రావు  అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే ఈ సినిమాను నవరస భరితంగా తెరమీద చూపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రాల్లోని పాట్లను ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

 

శ్రీకృష్ణుడు గా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు. 27 మార్చి 1957లో ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను కలర్ లో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు ఈనెల 28న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా TD జనార్దన్, రమేష్ ప్రసాద్, S.V కృష్ణారెడ్డి అచ్చి రెడ్డి, దర్శకుడు వీర శంకర్, భగీరథ, YJ రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌  శ్రీ టి.డి.జనార్ధన్‌ మాట్లాడుతూ.. "మాయాబజార్ సినిమా అప్పటి ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిది. ఇప్పుటితరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ ను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు మాయాబజార్ ని బలుసు రామారావు విడుదల చెయ్యడం అభినందించదగ్గ విషయం. సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవతారగా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ ముందు, తర్వాతగా తెలుగునాట రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీని ఏర్పాటు చేశాము, ఎన్టీఆర్‌ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంధాలను వెలువరిచాము. మాయాబజార్ విడుదలై గొప్ప విజయం సాధిస్తుంది అని నమ్మకం నాకుంది. మే 28 న మహానాడులో పాల్గొంటున్న కారణంగా ఆ రోజు నేను మాయాబజార్ ను వీక్షించలేకపోయినా, కుటుంబ సమేతంగా మర్నాడు చూస్తాను. అందరూ దీనిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు.

 

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మా ఫాదర్, రామారావు గారు కలిసి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. వాళ్ళ సేవలు చిరస్మరణీయం. మాయాబజార్ చిత్రాన్ని ఐమ్యాక్స్ థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో విడుదల చెయ్యడానికి బలుసు రామారావు అనుమతి కోరారు. వెంటనే ఆమోదించాము." అన్నారు.

 

SV కృష్ణారెడ్డి మట్లాడుతూ.. "NT రామారావు గారు ఒక చరిత్ర, ఒక అధ్యాయం, ఆయననుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మాయాబజార్ చిత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేను ఐమ్యాక్స్ థియేటర్ లో రిలీజ్ రోజున రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. మే 28 న అందరూ మాయాబజార్ ను థియేటర్స్ లో చూడండి." అన్నారు.

 

అచ్చిరెడ్డి మట్లాడుతూ.. "క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చెయ్యడం మన బాధ్యత. అదే మనం మహనీయులకు ఇచ్చే గౌరవం. బలుసు రామారావు మే 28 న మాయాబజార్ ను విడుదల చేసి గొప్ప పని చేస్తున్నారు. ఈతరం వారు కూడా చూడవలసిన సినిమా మాయాబజార్ అన్నారు." అన్నారు.

 

భగీరథ మాట్లాడుతూ.. "రామారావు గారిని కలిసి ఇంటర్వ్యూలు చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన డిసిప్లిన్, డెడికేషన్ ఎంతో ఉన్నతమైనవి. మే 28 న మాయాబజార్ ను రామారావు విడుదల చేయడం చాలా సంతోషం కలిగించింది." అన్నారు.

 

వీర శంకర్ మాట్లాడుతూ.. "బలుసు రామారావు నేను చాలా మంచి స్నేహితులం. మే 28 న మాయాబజార్ ను విడుదల చేస్తున్నారని చెప్పడంతో నేను సలహాలు, సూచనలు ఇచ్చాను. NT రామారావు గారితో ఉన్న అభిమానంతో బలుసు రామారావు తన స్వామి భక్తిని చాటుకుంటున్నాడు. ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని, మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి మాయాబజార్ చిత్రాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు.

 

బలుసు రామారావు మాట్లాడుతూ.. "నేను రామారావు గారికి వీరాభిమానిని, రామారావు గారి దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన మీదున్న అభిమానంతో నేను మాయాబజార్ ను రిలీజ్ చేస్తున్నాను. నా కోసం వచ్చిన TD జనార్దన్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి తదితరులకు రుణపడి ఉంటాను. మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను." అన్నారు.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.