మరో పాత టైటిల్ తో వంశీ పైడిపల్లి!?
on Jun 17, 2022
`మున్నా`, `బృందావనం`, `ఎవడు`, `ఊపిరి`, `మహర్షి`.. ఇలా ఇప్పటివరకు ఐదు చిత్రాలతో సందడి చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. వీటిలో `బృందావనం`, `మహర్షి` పాత సినిమాల టైటిల్స్ తోనే తెరకెక్కి అలరించాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `బృందావనం` 1993 నాటి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ `బృందావనం` శీర్షికని పునరావృతం చేస్తే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా కనిపించిన `మహర్షి` 1987 నాటి వంశీ డైరెక్టోరియల్ `మహర్షి` టైటిల్ ని రిపీట్ చేసింది.
కట్ చేస్తే.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో పాత టైటిల్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట వంశీ పైడిపల్లి. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జంటగా రష్మికా మందన్న ఎంటర్టైన్ చేయనుంది. 2023 పొంగల్ కి వినోదాలు పంచనున్న ఈ సినిమాకి.. తెలుగు వెర్షన్ లో `వారసుడు`, తమిళ వెర్షన్ లో `వారిసు` అనే టైటిల్స్ ని ప్లాన్ చేస్తున్నారట. అదే గనుక నిజమైతే.. సూపర్ స్టార్ కృష్ణ, కింగ్ నాగార్జున గతంలో చేసిన `వారసుడు` (1993) సినిమా తాలూకు టైటిల్ ని రిపీట్ చేయబోతున్నట్లే. త్వరలోనే ఈ టైటిల్ కి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `బృందావనం`, `మహర్షి` లాగే ఈ పాత టైటిల్ కూడా వంశీ పైడిపల్లికి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.