బన్నీతో `విక్రమ్` కెప్టెన్!?
on Jun 17, 2022
తమిళనాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు లోకేశ్ కనకరాజ్. `మానగరం`, `ఖైదీ`, `మాస్టర్`, `విక్రమ్` చిత్రాలతో నాలుగు వరుస విజయాలను అందుకున్న లోకేశ్.. త్వరలో కోలీవుడ్ స్టార్ విజయ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. `దళపతి 67` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అవకాశముంది. ఇందులో సమంత కథానాయికగా, ధనుష్ ప్రతినాయకుడిగా నటించే అవకాశముందని కోలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే, తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక అభిమానగణం సంపాదించుకున్న లోకేశ్ కనకరాజ్.. వచ్చే సంవత్సరం ఓ స్ట్రయిట్ టాలీవుడ్ పిక్చర్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని.. `పుష్ప - ద రూల్` విడుదలయ్యాక అంటే 2023 వేసవి తరువాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.