త్రివిక్రమ్- దేవిశ్రీ విబేధాలను పక్కనబెడతారా..?
on Nov 10, 2017
ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు వారి మధ్య మనస్పర్ధలు రాకమానవు. అర్ధం చేసుకుంటే ఆదిలోనే తొలగిపోయే సమస్యను.. కొందరు ఇగోలతోనో .. మరో కారణంతోనో మళ్లీ కలవడానికి ప్రయత్నించరు. దీని వల్ల ఆ బంధం తెగిపోయే పరిస్ధితి ఏర్పడుతుంది. అలాగే సినీ పరిశ్రమలోనూ నాటి నుంచి నేటి వరకు ఎందరో ప్రముఖల మధ్య స్వల్ప మనస్పర్ధలు రావడం ఆ తర్వాత కలిసిపోవడం జరిగింది. రాజశేఖర్-చిరంజీవి, చిరంజీవి-మోహన్ బాబు ఇలా కలిసినవారే. తాజాగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్.
ఇద్దరు కలిసి నాలుగు సినిమాలకు పనిచేశారు. అయితే సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమాకు దేవిశ్రీ కాకుండా మిక్కీ జే మేయర్ సంగీతం అందించడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాకు కూడా డీఎస్పీని పక్కనబెట్టి అనిరుధ్ని లైన్లోకి తెచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని టాలీవుడ్ టాక్. దీనికి బలాన్నిచ్చేలా ఒక పనిచేశాడు దేవి.
ఇటీవల కమల్హాసన్, త్రివిక్రమ్ ఒకే రోజు పుట్టినరోజు జరుపుకున్నారు.. ఈ సందర్భంగా తమిళ పరిశ్రమకు చెందిన కమల్హాసన్ను విష్ చేసి.. సొంత ఇండస్ట్రీకి చెందిన బాగా పరిచయం ఉన్న త్రివిక్రమ్ను పట్టించుకోలేదు. అతను కావాలని ఇలా చేశాడా..? లేక మరచిపోయాడా అనేది అర్ధంకాక ఫిలింనగర్ జనాలు జుట్టుపీక్కుంటున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఎడం పెరిగిందా లేకపోతే బిజీగా ఉండి పట్టించుకోలేదా అనేది అర్ధం కావడం లేదు.. మరి వీరిద్దరిపై వస్తున్న వార్తలకు క్లారిటీ రావాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.