షారుఖ్ ఖాన్ దర్శకుడితో ప్రభాస్ మూవీ!
on Jun 7, 2022
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో చేస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి(జనవరి 12, 2023) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో 'పఠాన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 25, 2023 న రిలీజ్ కానుంది. 'పఠాన్' తర్వాత హృతిక్ రోషన్ తో 'ఫైటర్' సినిమా చేయనున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత ప్రభాస్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని, ఈ సినిమాని కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది.
కాగా ఇప్పటికే 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ k' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేయనున్న ప్రభాస్.. మారుతీతోనూ ఒక సినిమా చేసే అవకాశముంది. ఈ లెక్కన సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ ఓకే అయినా పట్టాలెక్కాలంటే 2024 వచ్చే అవకాశముంది.