గోపీచంద్ సినిమాని రిజెక్ట్ చేసిన 'ఫిదా' హీరోయిన్
on Jun 16, 2020
తేజ దర్శకత్వంలో గోపీచంద్ 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. 'జయం'తో గోపీకి విలన్గా కెరీర్ని ఇచ్చిన తేజ, ఆ వెంటనే మహేశ్తో చేసిన 'నిజం'లోనూ అతడినే క్రూరమైన విలన్గా చూపించాడు. 'యజ్ఞం'తో రెండోసారి హీరోగా ట్రై చేసి సక్సెస్ అయిన గోపీ ఇన్నాళ్ల తర్వాత హీరోగా వేంకటరమణ క్యారెక్టర్లో తేజ డైరెక్షన్లో నటించనున్నాడు. అలిమేలుమంగ క్యారెక్టర్ కోసం ఇప్పటివరకూ అనుష్క, కాజల్ అగర్వాల్ పేర్లు వినిపించాయి కానీ ఎవరినీ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం లేదు.
అయితే లేటెస్ట్గా మరో క్రేజీ హీరోయిన్ను ఆ క్యారెక్టర్ కోసం సంప్రదించారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు.. ప్రేక్షకుల్ని తన నటనతో 'ఫిదా' చేసిన సాయిపల్లవి! గోపీచంద్, సాయిపల్లవి జంట అంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుందనే అభిప్రాయంతో తేజ ఆమెను సంప్రదించాడనీ, అయితే డేట్స్ సమస్యతో ఆ ప్రాజెక్టును సాయిపల్లవి చేయలేనని చెప్పేసిందని ఫిల్మ్నగర్లో చెప్పుకుంటున్నారు.
సందర్భవశాత్తూ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోన్న 'విరాటపర్వం'లో హీరోగా మొదట డైరెక్టర్ వేణు ఊడుగుల సంప్రదించింది గోపీచంద్నేననీ, అప్పుడు ఆ సినిమాని గోపీ తిరస్కరించాడనీ, దాంతో రానాను వేణు సంప్రదించడం, అతను ఓకే చెప్పడం జరిగిపోయిందనీ ఇటీవల బాగా ప్రచారంలోకి రావడం గమనార్హం. అంటే ఇలా ఒకరి సినిమాల్ని మరొకరు గోపీ, పల్లవి కాదనుకున్నారన్న మాట.