శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ లో పవన్ కళ్యాణ్.!
on Oct 16, 2021
రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా 'లీడర్'. 2010 లో విడుదలైన ఈ పొలిటికల్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ శేఖర్ కమ్ముల ఓ పొలిటికల్ మూవీ తీయడానికి సిద్ధమయ్యారని, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల 'లవ్ స్టోరి' సినిమాతో విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల.. పవన్ కళ్యాణ్ తో ఒక పొలిటికల్ మూవీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక నాయకుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారని అంటున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలు లక్ష్యంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. దీంతో ఈ సినిమాను 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అలా చేస్తే అటు సినిమాకు, ఇటు పవన్ కు బాగా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారట.
మరోవైపు పవన్ తో శేఖర్ కమ్ముల చేయబోయే సినిమా లీడర్ సీక్వెల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. 'లీడర్' లో నిజాయితీపరుడు సీఎం అయితే ఎలా ఉంటుందో చూపించారు. పవన్ తో చేయబోయే సినిమా కూడా అదే తరహాలో ఉండనుందని న్యూస్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.