ENGLISH | TELUGU  

50 ఏళ్ళు తన గాన మాధుర్యాన్ని పంచిన ఎస్‌.పి.బాలు సినీ ప్రస్థానం ఇదే!

on Jun 3, 2025

(జూన్‌ 4 ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా..)

ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన మాటలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఆయన పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగు ఆయన మాటల్లో, పాటల్లో ధ్వనిస్తుంది. ఒక దశలో ఆయన పాట లేని సినిమా లేదు. ఆయన పాట వినిపించని ఇల్లు లేదు. ఆయన పాట లేని మ్యూజికల్‌ నైట్‌ లేదు. ప్రేమ గీతమైనా, విషాద గీతమైనా, నవ్వులు పూయించే పాటైనా, శాస్త్రీయ సంగీతమైనా ఆయన గళం నుంచి వచ్చింది అంటే శ్రోతలు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్‌, ఏసుదాస్‌ వంటి దిగ్గజ నేపథ్యగాయకులు తెలుగు సినిమా సంగీతాన్ని ఏలుతున్న రోజుల్లో ఓ యువ కెరటంలా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. దేశంలోని 16 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బాలు సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితాన్ని ఎలా ప్రారంభించారు? సింగర్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? 50 సంవత్సరాలకు పైగా సంగీత ప్రియులను అలరించిన ఆయన జీవన ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి హరికథ కళాకారుడు. వారి ఇంట్లో నిత్యం పండితులు, కవులు సాహిత్యపరమైన చర్చలు జరిపేవారు. దాంతో బాలుకి తెలుగు భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథలు చెప్తుండడంతో అతనికి సంగీతంపై మక్కువ ఏర్పడింది. రేడియోలో వచ్చే పాటలు వింటూ వాటినే ప్రాక్టీస్‌ చేసేవారు. పియుసి చదివే రోజుల్లోనే ఒక లలిత గీతాన్ని స్వయంగా రాసి, స్వరపరిచి రేడియోలో పాడారు. ఆ పాటకు బహుమతి లభించింది. ఆ తర్వాత నెల్లూరు వెళ్లి మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. తన కొడుకు ఇంజనీరు కావాలని సాంబమూర్తి కలలు కనేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాస్‌లో ఎ.ఎం.ఐ.ఇ. కోర్సులో చేరారు బాలు. కాలేజీలో చదువుకుంటూనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు. 

1964లో మద్రాస్‌లో జరిగిన లలిత సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఘంటసాల, పెండ్యాల, ఎస్‌.పి.కోదండపాణి హాజరయ్యారు. అందులో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ సమయంలోనే బాలుకి సింగర్‌గా అవకాశం ఇస్తానని కోదండపాణి మాట ఇచ్చారు. దాని ప్రకారమే పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పి.బి.శ్రీనివాస్‌, రఘురామయ్య, పి.సుశీలతో కలిసి పాట పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. ‘ఏమి ఈ వింత మోహం..’ అంటూ సాగే పాట ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు బాలు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు బాలు పాడిన పాటను వినిపించి అతనికి అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. అలా తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో తర్వాతి కాలంలో తను నిర్మించిన ఆడియో లాబ్‌కి కోదండపాణి పేరే పెట్టుకున్నారు బాలు. 1968లో విడుదలైన సుఖదు:ఖాలు చిత్రంలో బాలుకి మూడు పాటలు పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. అందులో ‘మేడంటే మేడా కాదు..’ అనే పాట బాలుకి సింగర్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి శోభన్‌బాబు, కృష్ణ, చలం, హరనాథ్‌, చంద్రమోహన్‌ వంటి హీరోలకు వరసగా పాటలు పాడుతూ వచ్చారు బాలు. 

అప్పటివరకు తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన ఘంటసాల.. ఆరోగ్య రీత్యా 1965 తర్వాత తనకు తానుగా పాటలు తగ్గించుకున్నారు. ఆ సమయంలో బాలుకి బాగా అవకాశాలు వచ్చాయి. కొన్ని పాటలకు బాలుని ఘంటసాల రికమెండ్‌ కూడా చేసేవారు. 1974లో ఘంటసాల కన్ను మూసిన తర్వాత బాలు నెంబర్‌వన్‌ సింగర్‌ అవుతారని అంతా భావించారు. కానీ, అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం అప్పుడే కొత్తగా వచ్చిన సింగర్‌ రామకృష్ణ. ఘంటసాల గొంతుని పోలి ఉండడంతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు.. తమ సినిమాలో అతనే పాడాలని కండిషన్‌ పెట్టారు. ఆ దశలో బాలుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో అతన్ని ప్రోత్సహించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. సంవత్సరానికి ఐదారు సినిమాలకు తక్కువ కాకుండా చేసే కృష్ణకు అన్ని పాటలూ పాడేవారు బాలు. మరోపక్క రామకృష్ణ పెద్ద హీరోలందరికీ పాటలు పాడుతున్నారు. స్వతహాగా బాలుకి మిమిక్రీ కళ తెలుసు. ఏ హీరో ఎలా మాట్లాడతారు, పాట పాడితే ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన ఉంది. ఆ సమయంలో సంగీత దర్శకుడు చలపతిరావు ఇచ్చిన సలహా బాలుకి బాగా ఉపయోగపడింది. హీరోలకు తగ్గట్టుగా గొంతులో కొంత మార్పు చేసి పాడితే సక్సెస్‌ అవుతావని ఆయన చెప్పారు. అలా ఆలుమగలు చిత్రంలోని ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను..’ అనే పాటను అక్కినేని నాగేశ్వరరావును అనుకరిస్తూ పాడడం అందర్నీ ఆకట్టుకుంది. ఇక అక్కడి నుంచి బాలు కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎన్టీఆర్‌ నుంచి చిన్న హీరోల వరకు అందరూ బాలుతోనే పాటలు పాడించుకోవాలని డిసైడ్‌ అవ్వడంతో అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 

1980లో వచ్చిన ‘శంకరాభరణం’ ఎస్‌.పి.బాలు కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటల్ని బాలుతోనే పాడించాలని కె.వి.మహదేవన్‌ అనుకున్నారు. అయితే శాస్త్రీయ సంగీతం తెలియని బాలు ఆ పాటలు పాడేందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మహదేవన్‌ శిష్యుడు పుహళేంది.. బాలుకి శిక్షణ ఇచ్చి ఆ పాటలు పాడించారు. ఆ పాటలు ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో బాలు తిరుగులేని సింగర్‌ అయిపోయారు. అప్పుడు మొదలు దాదాపు 30 సంవత్సరాలపాటు పెద్దా, చిన్నా హీరోలందరికీ తనే పాడుతూ బిజీ సింగర్‌ అయిపోయారు. ఆయన పాడిన పాటల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే తెలుగు శ్రోతలు, ప్రేక్షకుల మనసుల్లో ఆయన పాడిన పాటలు ఎప్పుడూ మారు మోగుతూనే ఉంటాయి. ఆ పాటలను మళ్ళీ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు. 

నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ళ పంట చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. స్వతహాగా మంచి హాస్యప్రియుడైన బాలు.. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్‌ చేసేందుకే ఇష్టపడేవారు. నటుడిగా ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే సినిమా మిథునం. ఈ చిత్రంలోని నటనకుగానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు బాలు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత కొంత సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి దాదాపు 50 సినిమాలకు సంగీతాన్నందించారు. అంతేకాదు, డబ్బింగ్‌ కళాకారుడిగా కూడా రాణించి ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మన్మథలీల చిత్రంలో తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పగా, అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్‌కి బాలు తన వాయిస్‌ని ఇచ్చారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌లతోపాటు ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు బాలు. 

ఎస్‌.పి.బాలు అజాత శత్రువు.. ఎవరితోనైనా స్నేహం చేయగల స్నేహశీలి. 50 సంవత్సరాల్లో చిన్న వివాదం కూడా లేని కెరీర్‌ని నడిపారు బాలు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. తోటి సింగర్స్‌.. ఇలా అందరితోనూ స్నేహభావంతోనే మెలిగేవారు. ఎవరికైనా ఆపద వస్తే ముందుకు వచ్చి ఆదుకునేవారు. ఈ లక్షణం అందరికీ నచ్చడం వల్ల అందరికీ బాలు ఎంతో ఇష్టుడయ్యారు. అయితే టాలెంట్‌ ఉండడం వల్లే అది సాధ్యమైంది. ఒకప్పుడు మహ్మద్‌ రఫీని భారతీయ గాయకుడు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన హిందీలోనే కాకుండా కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే.. 16 భాషల్లో పాటలు పాడారు. కొన్ని లిపి లేని భాషల్లో కూడా పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలా మహ్మద్‌ రఫీ తర్వాత భారతీయ గాయకుడుగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పేరును చెప్పుకోవచ్చు. ఇక బాలు అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. భారతదేశంలోని ఏ గాయకుడికీ లభించని గౌరవం బాలుకి దక్కింది. లెక్కకు మించిన అవార్డులు ఆయన్ని వరించాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలతోపాటు ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు అందుకున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.