English | Telugu
పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ ఇంకొకరితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు!
Updated : Dec 21, 2021
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఓ వైపు సాంగ్స్ తో సంచలనం సృష్టిస్తూ.. మరో బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతూ.. ప్రస్తుతం తనకి తిరుగులేదు అనిపించుకుంటున్నాడు. సౌత్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్.. బాలీవుడ్ అంటే మాత్రం నా వల్ల కాదు అంటున్నాడు. హిందీ సినిమాలకు మ్యూజిక్ చేయడం 'పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ ఇంకొకరితో' లాగా అనిపిస్తుందని తమన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తమన్ గెస్ట్ గా పాల్గొన్నాడు. డిసెంబర్ 27 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో తమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆరో తరగతి వరకు మాత్రమే చదువుతున్న తాను.. అప్పుడు కూడా చదువుకోకుండా డ్రమ్స్ వాయించేవాడినని అన్నారు. తండ్రి మరణంతో చదువు ఆపేశానని చెప్పిన తమన్.. అప్పుడు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో తన తల్లి డ్రమ్స్ కొనిచ్చిందని చెప్పాడు.
బాలకృష్ణ నటించిన 'భైరవ ద్వీపం' సినిమా తన మొదటి సినిమా అని తమన్ తెలిపాడు. ఆ సినిమాలో రోజా గారి బెడ్ గాల్లోకి లేచినప్పుడు డ్రమ్స్ కొట్టింది తానేనని, ఆ సినిమాకి 30 రూపాయలు ఇచ్చారని అన్నాడు. 20 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' సినిమాలో నటించిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
హిందీలో ఏ సినిమాలు చేశావని ఆలీ అడగగా.. గోల్ మాల్, సింబా, సూర్యవంశీ సినిమాలకు పని చేశానని తమన్ చెప్పాడు. ఎందుకు అక్కడ సెటిల్ కాలేదు అని ఆలీ అడగగా.. తమన్ ఊహించని సమాధానం చెప్పాడు. "సినిమాకు ఆరు మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఓ రీల్ రీరికార్డింగ్ చేయండి, ఓ పాట చేయండి అని అడుగుతారు. అలా చేయడం నా వల్ల కాదు. అంటే.. పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ ఇంకొకరితో లాగా అయిపోతుంది" అని తమన్ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ గురించి తమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.