English | Telugu
సీఎంపై కస్తూరి ఫైర్.. కామెంట్స్ వైరల్!
Updated : May 21, 2021
ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి, సీరియల్స్ తో బిజీ అయ్యారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'గృహాలక్ష్మి సీరియల్ లో కస్తూరి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో ప్రతి విషయంపైనా ఆమె స్పందిస్తూ ఉంటారు. స్వతహాగా న్యాయవాది కావడంతో కస్తూరి అన్ని విషయాలపైనా అవగాహనతో మాట్లాడుతుంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషణలో ముందుంటారు. సినీ, రాజకీయ విషయాలపై కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతుంటాయి.
గతేడాది లాక్ డౌన్ నుండి కస్తూరి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ తమిళనాడులో వివాదానికి దారి తీశాయి. అయితే చివరికి ఆ మూడో పెళ్లి కూడా పెటాకులు అవ్వడంపై కస్తూరి కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈమె కరోనా వైరస్, దేశ ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆక్సిజన్ కొరత వంటి విషయాలపై వేస్తోన్న కౌంటర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె కేరళ సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారంపై కామెంట్ చేశారు.
రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం వేడుకకు మొత్తం 500 మంది హాజరయ్యారు. దీని గురించి ప్రశ్నిస్తూ.. అదే ఓ కామన్ మ్యాన్ విషయంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. సంతాపం తెలిపేందుకు 20 మందికి మించి మాత్రం అనుమతివ్వరా..? అంటూ ప్రశ్నించారు. 'అన్ని జంతువులు సమానమే.. కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం' అంటూ కౌంటర్ వేశారు. "ప్రమాణ స్వీకారం బడ్జెట్ తో ఎంత మందికి కరోనా వ్యాక్సిన్ వేయొచ్చో తెలుసా..?" అంటూ కస్తూరి మండిపడ్డారు.