Read more!

English | Telugu

డాక్ట‌ర్ బాబు భార్య మంజుల గురించి మీకు తెలీని నిజాలు!

 

క‌న్న‌డ‌మ్మాయి మంజుల తెలుగింటి కోడ‌లు. 'చంద్ర‌ముఖి' సీరియ‌ల్‌తో తెలుగు టీవీ వీక్ష‌కుల‌కు ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు. 'కార్తీక‌దీపం' సీరియ‌ల్‌లో హీరో డాక్ట‌ర్ బాబుగా న‌టిస్తోన్న ప‌రిటాల నిరుప‌మ్ భార్య‌గా ఆమె మ‌రింత చేరువ అయ్యారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజుల రెగ్యుల‌ర్‌గా త‌న ఫొటోల‌ను అప్‌డేట్ చేస్తూ ఫాలోయ‌ర్స్‌కు ఆనందం క‌లిగిస్తుంటారు. అంతేకాదు, అప్పుడ‌ప్పుడు త‌మ ఇంట్లో జ‌రిగే వేడుక‌లు, ఫ్యామిలీతో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటారు. ఆమె గురించి చాలా మందికి తెలీని విష‌యాల‌ను పంచుకుందాం...

మంజుల బెంగ‌ళూరులో ఓ క‌లిగిన కుటుంబంలో 1990 మే 9న పుట్టారు. వాళ్ల నాన్న శివ‌శంక‌ర్ హెడ్ కానిస్టేబుల్‌. ఆమె త‌ల్లి గృహిణి. మంజుల‌కు చంద్ర‌క‌ళ అనే అక్క‌, కీర్తి అనే చెల్లెలు ఉన్నారు. మంజుల కంటే ముందే ఆమె చెల్లెలు కీర్తి బుల్లితెర‌పై బాల‌న‌టిగా న‌టించింది. ఆ త‌ర్వాత కీర్తి కూడా తెలుగు సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా, అక్క మంజుల త‌ర‌హాలో టీవీ న‌టుడు ధ‌నుష్‌ను పెళ్లాడి, త‌ను కూడా తెలుగింటి కోడ‌లు అయిపోయింది. 

కీర్తి బాల‌న‌టిగా బిజీగా ఉంటే, మంజుల చ‌దువుతో బిజీగా ఉండేవారు. చెల్లితో క‌లిసి ఆమె ఏనాడూ షూటింగ్ లొకేష‌న్‌కు వెళ్లింది లేదు. ఆమె ఇంట‌ర్మీడియేట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు వాళ్ల నాన్న స్నేహితుడు ఒకాయ‌న ఓ సీరియ‌ల్‌లో కొత్త‌వాళ్ల కోసం వెతుకుతున్నార‌ని చెప్తే, ఆడిష‌న్‌కు వెళ్లారు. అందంగా ఉన్న ఆమెను చూసి ఓకే చేశారు. ఆ సీరియ‌ల్ నిర్మాత‌లే ఆమెకు డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఇవ్వాలి లాంటి విష‌యాల‌పై ట్రైనింగ్ ఇప్పించారు. అలా క‌న్న‌డ సీరియ‌ల్ 'ప్రేమ పిశాచిగ‌ళు'తో ఆమె చిన్నితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

అలా కాలేజీలో చ‌దువుతూనే ఐదు క‌న్న‌డ సీరియ‌ల్స్‌లో ఆమె న‌టించారంటే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. బీకామ్ పూర్త‌య్యాక ఆమెకు తెలుగు సీరియ‌ల్ 'చంద్ర‌ముఖి' ఛాన్స్ వ‌చ్చింది. కొత్త ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో అని భ‌య‌ప‌డుతూనే అందులో న‌టించారు. అమాయ‌క‌త్వం, స‌హ‌నం మేళ‌వించిన ఆ సీరియ‌ల్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. అలా తొలి తెలుగు సీరియ‌ల్‌తోటే ప్రేక్ష‌కుల అభిమాన‌ తార‌గా మారారు మంజుల‌. ఆ సీరియ‌ల్‌లో న‌టించేట‌ప్పుడే అందులో హీరోగా న‌టించిన నిరుప‌మ్‌తో ప్రేమ‌లో ప‌డ‌టం, అది పెళ్లికి దారి తీయ‌డం జ‌రిగిపోయాయి. 2010లో వారు దంప‌తులుగా మారారు. వారికి అక్ష్‌రాజ్‌ అనే కొడుకు పుట్టాడు.

'చంద్ర‌ముఖి'తో పాటు 'అమ్మాయి కాపురం', 'నీలాంబ‌రి', 'కాంచ‌న‌గంగ' సీరియ‌ల్స్ మంజుల‌కు మంచి పాపులారిటీ తెచ్చాయి. 'కాంచ‌న‌గంగ‌'లో చేసిన నెగ‌టివ్ రోల్ ఆమె న‌ట‌న‌లోని మ‌రో పార్శ్వాన్ని వీక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. 2013లో స‌న్ టీవీ సీరియ‌ల్ 'పొన్నుంజాల్‌'లో ప్రియా వ‌రుణ్ అనే నెగ‌టివ్ రోల్ పోషించ‌డం ద్వారా త‌మిళ టీవీ ఇండ‌స్ట్రీలోకి కూడా ఆమె అడుగుపెట్టారు. ఆమె న‌ట‌న త‌మిళ వీక్ష‌కుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం ఆమె ఓవైపు న‌టిస్తూ, మ‌రోవైపు త‌న ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.