English | Telugu

"అఖిలే నెంబర్ వన్.. దృష్టి తీయాలి".. మోనాల్ కామెంట్‌ వైర‌ల్‌!

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అఖిల్ సార్థక్ ఫైనల్స్ వరకు చేరుకొని రన్నరప్ గా నిలిచాడు. ఈ షో నుండి బయటకి వచ్చిన తరువాత అఖిల్ కి పలు వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. అయితే తాజాగా అఖిల్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్లు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్శనాలిటీ జాబితాలో 2020 ఏడాదికి గాను మేల్ కేటగిరీలో అఖిల్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

దీంతో బుల్లితెరతో పాటు వెండితెరకు చెందిన సెలబ్రిటీలు కూడా అఖిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా అఖిల్ ఓ సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఎంపికయ్యాడు. దానికి సంబంధించిన హైద‌రాబాద్ టైమ్స్ స్టోరీని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్ షేర్ చేశాడు. దీనిపై అత‌డి స్నేహితురాలు, బిగ్ బాస్ షో మాజీ కంటెస్టెంట్ మోనాల్ స్పందించింది. "దృష్టి తీయాలి" అంటూ కామెంట్ పెట్టింది.

అంతే కాదు, తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది. "అందరూ చూడండి.. మా దోస్త్ అఖిలే నెంబర్ వన్" అంటూ ముద్దుల ఎమోజీలను జోడించింది. దీంతో మరోసారి అఖిల్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరచినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానున్న‌ది.