English | Telugu
హైపర్ ఆది.. టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ.. పవన్ కోసం ఏదైనా..
Updated : Feb 14, 2024
జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఎంతగా నవ్విస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన కమెడియన్ ‘హైపర్ ఆది’. ఆది వేసే పంచ్లు, కామెడీ టైమింగ్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఐతే జడ్జిగా ఇంద్రజ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆది, ఇంద్రజ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంద్రజ గజ్జె కట్టి డాన్స్ వేస్తే ఆ సీన్ గురించి మరో ఎపిసోడ్ లో కౌంటర్ వేసేస్తాడు ఆది. ఆది, ఇంద్రజ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కామెడీ కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. హైపర్ ఆది ఈ మధ్య సినిమాల మీద ఫోకస్ పెట్టినా బుల్లితెర మీద ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఐతే ఇప్పుడు ఆది గురించి ఇంద్రజ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. అదేంటంటే "హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యింది. మేమిద్దరం ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం. కానీ అతను కష్టపడి చేసే పనికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. కంగ్రాట్యులేషన్స్ ..ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తున్నా" అని చెప్తూ 2014 లో ఆది ఫోటోని ఇప్పుడు ఆది ఫోటోని కొలెజ్ చేసి పోస్ట్ చేసింది. ఇకపోతే ఆది మొదటి నుంచి చిన్న చిన్నగా అన్నిటిలోకి ఎంట్రీ ఇస్తూ ఇప్పుడు పొలిటికల్ గా కూడా కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఐతే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. తనను ఇంతవాడిని చేసింది ‘జబర్దస్త్’ షోనే అంటూ జనసేన సభల్లో చెప్తూ వస్తున్నాడు. ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. నాగబాబులానే ఆమె కూడా తనను ప్రోత్సహించారని క్లారిటీ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్టు చెప్పాడు. తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించాడు.