English | Telugu
థియేటర్ల విషయంలో నిర్మాతలు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
Updated : May 26, 2025
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రధాన సాధనంగా సినిమా ఉండేది. దాన్ని చూడాలంటే తప్పనిసరిగా థియేటర్కే వెళ్లాలి. మరో ఫార్మాట్లో సినిమా చూసే అవకాశం లేదు. ఆరోజుల్లో థియేటర్లు ప్రేక్షకులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేవి. ప్రతివారం పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ ఉండేవి. రాను రాను పెద్ద హీరోల సినిమాలు తగ్గడంతో థియేటర్ల పరిస్థితి అయోమయంగా మారింది. దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రేక్షకుల చేతుల్లోకి వచ్చేసింది. అనేక మాధ్యమాలలో వినోదం అందుబాటులో ఉంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ వైపు వెళ్లే సాహసం చేయడం లేదు. వీటన్నింటినీ మించి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మొదటి షో ముగిసిన గంటలోనే ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద హీరోల సినిమాలు నిర్మించే నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. అవకాశం ఉన్నవారు ఇంటర్నెట్ నుంచి సినిమాను డౌన్లోడ్ చేసుకొని చూసేస్తున్నారు. అది థియేటర్లో చూసే సినిమా అని భావిస్తే తప్ప థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి పలు సమస్యల కారణంగా సినిమా థియేటర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను అందించే మాధ్యమాలు పెరిగిపోవడం, సినిమా రిలీజ్ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వంటి అంశాలు సింగిల్ థియేటర్లు మూత పడడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా సింగిల్ థియేటర్లను మూసివేశారు. హైదరాబాద్లోనే మూతపడిన థియేటర్లు లెక్కకు మించి ఉన్నాయి. మిగిలి ఉన్న థియేటర్లు కూడా కొందరి చేతుల్లో ఉండడం వల్ల కొందరు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. కొందరు హీరోలు రెండు సంవత్సరాలకు కూడా ఒక్క సినిమా థియేటర్లకు తీసుకురాలేకపోతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు వారాలు థియేటర్ల దగ్గర హడావిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే.
ఈ నేపథ్యంలో ఇటీవల థియేటర్ల బంద్కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. దీనిపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఇటీవల చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య రాజీ కుదరడంతో థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. థియేటర్ల వల్ల వచ్చే రెవిన్యూ గురించే కాకుండా చాలా విషయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. థియేటర్లకు ప్రేక్షకులు రావడం గణనీయంగా తగ్గిపోవడంతో వారిని థియేటర్లకు ఎలా రప్పించాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ విషయంలో నిర్మాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. థియేటర్లలో అమ్మే తినుబండారాల రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని, అలాగే వాహనాల పార్కింగ్ ఫీజు లేకుండా ఉంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో పెద్ద హీరోల సినిమాల రీరిలీజ్లు ఉండకూడదు. దాని వల్ల చిన్న సినిమాలకు చాలా నష్టం వాటిల్లుతుందనే ఏకాభియ్రానికి అందరూ వచ్చారు. కొత్త సినిమాలు రిలీజ్ లేని సమయంలోనే రీరిలీజ్లు పెట్టుకోవాలని సూచించారు. ఇక పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చెయ్యాలి. ఈ విషయంలో వారితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలి. ఇక సినిమాకి అత్యంత ప్రమాదకరంగా మారిన పైరసీ వెబ్సైట్లను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఓటీటీ వ్యవస్థ. ఇటీవలి కాలంలో ఓటీటీ సంస్థల ఆధిపత్యం పెరిగిపోయింది. ఒక సినిమాను ఓటీటీకి తీసుకునే క్రమంలో వారు ఎన్నో షరతులు పెడుతున్నారని, వాటన్నింటికీ నిర్మాతలు ఒప్పుకోకుండా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దాన్ని అదనుగా తీసుకొని ఇష్టానుసారం రేట్లు పెంచకూడదని, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగానే టికెట్ రేట్లు ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే హీరోలు తమ రెమ్యునరేషన్ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా కమిటీ ఒక నిర్ణయానికి రావాలని నిర్మాతలు కోరుతున్నారు. వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఇప్పటికైనా సరైన పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.
