Read more!

English | Telugu

‘కృష్ణాష్టమి’ సినిమా స్టోరీ ఇదేనా..!

‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్ నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. వరుస అట్టర్ ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న సునీల్ తాజాగా ‘కృష్ణాష్టమి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహించారు. దినేష్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సునీల్ సరసన నిక్కీ గల్రానీ, డింపుల్ చొపాడియా హీరోయిన్లుగా నటించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను రేపు(ఫిబ్రవరి19) ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కానీ ఈ సినిమా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు దిల్ రాజు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుంటాయి. అందులోనే కథ విషయంలోను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటిది ‘కృష్ణాష్టమి’ చిత్రం కథ లీక్ అయ్యిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ‘కృష్ణాష్టమి’ కథ ఏంటో ఓసారి చూద్దామా.

సునీల్ విదేశాల్లో వ్యాపారం చేస్తుంటాడు. ప్రమాదంలో వున్నవారిని రక్షించడానికి ఎంత రిస్క్ అయినా చేసే కుర్రాడు. అయితే ఎంత విదేశాల్లో వున్నా కూడా తనకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియాలోని సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు అంటే చాలా గౌరవం. అయితే అనుకోకుండా సునీల్ జీవితంలోకి నిక్కీ గల్రానీ ప్రవేశిస్తుంది. తొలిచూపులోనే నిక్కీతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత నిక్కీకి దగ్గరయ్యేందుకు, నిక్కీ ఫ్యామిలీకి దగ్గరవుతాడు. ఆ తర్వాత నిక్కీ కూడా సునీల్ తో ప్రేమలో పడుతుంది. ఇదిలా జరుగుతుండగానే సునీల్ జీవితంలోకి విలన్ ఎంటర్ అవుతారు. ఇండియాలో తనకున్న ఆస్తికోసం కన్నేసిన ముఖేష్ రుషి.... ఆ ఆస్తి వారసుడు ఇండియాకు వస్తే.. తనకు ఆస్తి దక్కదనే వుద్దేశ్యంతో సునీల్ ను విదేశాల్లోనే చంపేయాలని ప్రయత్నిస్తారు. కానీ సునీల్ వారిని చితకొట్టి, ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు.

సీన్ కట్ చేస్తే... నిక్కీ గల్రానీ ఫ్యామిలీ ఇండియాకు వెళ్లిపోతుంది. అలాగే తనకు ఇండియాలో ఓ ఫ్యామిలీ వుందని తెలుసుకున్న సునీల్ ఇండియా బయలుదేరుతాడు. ఇండియాకు వచ్చిన సునీల్ ను చంపేయాలని ముఖేష్ రుషి మళ్లీ సునీల్ పై అటాక్ చేయిస్తాడు. కానీ మళ్లీ సీన్ రిపీట్. చితక్కొట్టడం కామన్. ఇక ఇండియాలో సునీల్ తన మేనత్త ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.

సీన్ కట్ చేస్తే... అక్కడ మేనత్త కూతురు డింపుల్ చొపాడియా పరిచయమవుతుంది. తొలిచూపులోనే సునీల్ తో ప్రేమలోపడుతుంది డింపుల్. తన ప్రేమ కష్టాలతో పాటు, తనను చంపాలని ప్రయత్నిస్తున్న సమస్యలను సునీల్ ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగతా కథాంశం.

ఈ సినిమాకు దిల్ రాజు 3.25 రేటింగ్ ఇస్తానని చెప్పడంతో సినిమాపై మరింత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని గొప్పలు చెప్పుకోకుండా.. నిజాయితీగా 3.25 రేటింగ్ ఇస్తానని చెప్పడం దిల్ రాజు గొప్పతనం.

ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కు ‘కృష్ణాష్టమి’ చిత్రం ఎలాంటి విజయం అందించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.