English | Telugu

‘పుష్ప3’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. మరి సుకుమార్‌ రెడీగా ఉన్నాడా?

‘పుష్ప’ సిరీస్‌తో సంచలన విజయాలు నమోదు చేసిన సుకుమార్‌ టీమ్‌ తమ తర్వాతి సినిమా కోసం పనులు మొదలుపెట్టేశారు. ‘పుష్ప2’ సాధించిన ఘనవిజయం తర్వాత ‘పుష్ప3’ కోసం ప్రేక్షకులు, బన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు క్లారిటీ ఇచ్చారు.

అందరూ ఎదురుచూస్తున్నట్టు ‘పుష్ప3’ ఇప్పట్లో ఉండదు అనేది నిర్మాతలు ఇస్తున్న క్లారిటీ. ప్రస్తుతం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది’ సినిమా చేస్తున్న చరణ్‌తో తమ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు తెలియజేస్తున్నారు. ‘పుష్ప3’ కంటే ముందే చరణ్‌తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. 2018లో చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి సంస్థ నిర్మించిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే.

‘పెద్ది’ షూటింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మే నెలలో చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్త మెగాభిమానులకు సంతోషాన్ని కలిగించేదే. కానీ, బన్నీ అభిమానులు మాత్రం ‘పుష్ప3’ ప్రాజెక్ట్‌ ఇప్పట్లో లేదని తెలిసి డిజప్పాయింట్‌ అవుతున్నారని తెలుస్తోంది. మరి చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఏ జోనర్‌లో ఉంటుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.