English | Telugu

అదే తన చివరి సినిమా అంటున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌!

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జాతిరత్నాలు’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా ‘జాతిరత్నాలు’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే అంత పెద్ద హిట్‌ ఇచ్చిన దర్శకుడు అనుదీప్‌కి మళ్ళీ తెలుగులో సినిమా చేసే అవకాశమే రాలేదు. అయితే గత సంవత్సరం తమిళ్‌లో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్‌’ అనే సినిమా చేశాడు. అది ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమా రిలీజ్‌ అయి సంవత్సరం దాటుతున్నా.. అతని నెక్స్‌ట్‌ సినిమా ఏమిటి అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే రవితేజ హీరోగా ఒక సినిమా చేసే అవకాశం ఉందని, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 2016లో వచ్చిన ‘పిట్టగోడ’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనుదీప్‌ ఆ సినిమా తర్వాత దాదాపు 5 ఏళ్ళు గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది. 2021లో ‘జాతిరత్నాలు’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు.

‘జాతిరత్నాలు’ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ కూడా చేసిన అనుదీప్‌ లేటెస్ట్‌గా ‘మ్యాడ్‌’ సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కార్యక్రమంలో అనుదీప్‌ పాల్గొన్నాడు. తన కెరీర్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పాడు. ఇకపై తాను సినిమాల్లో నటించబోనని ప్రకటించాడు. ‘మ్యాడ్‌’ డైరెక్టర్‌ కళ్యాణ్‌ అడగడం వల్లే తాను నటించానని, అయితే ఇదే తన చివరి సినిమా అని, డైరెక్టర్‌గానే కొనసాగుతానని చెప్పాడు.