Read more!

English | Telugu

"చంద్రిక" డిఫరెంట్ హారర్ థ్రిల్లర్

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆశ నిర్మిస్తున్న చిత్రం "చంద్రిక". హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో కామ్నజెత్మలాని, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువ ప్రతిభాశాలి యోగేష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండగా.. "పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్" సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతూనే సూపర్ హిట్ సొంతం చేసుకొన్న సాజిద్ ఖురేషి "చంద్రిక" చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే సమకూరుస్తుండడం విశేషం. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 24న విడుదలవుతుండగా.. తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా "చంద్రిక" చిత్ర కథానాయికలు కామ్నజెత్మలాని, శ్రీముఖి మీడియాతో సమావేశమయ్యారు.

కామ్నజెత్మలాని మట్లాడుతూ... "చిన్న పిల్లలకు నాట్యం నేర్పిస్తూ ఎంతో మంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఓ అందమైన యువతి జీవితం.. ఒక యువకుడి కారణంగా ఎటువంటి మలుపులు తిరిగింది అనేది చిత్ర కథాంశం. ఈ సినిమాలో నేను "చంద్రిక"గా టైటిల్ పాత్రలో నటిస్తున్నాను. ఈ చిత్రానికి సాజిద్ గారు అందించిన కథ, స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత వి.ఆశ గారు నిర్మాణ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంటర్వెల్ సీన్ అవుట్ పుట్ సరిగా రాలేదని.. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్లీ ఆ సీన్ ను రీషూట్ చేసారు. ఇటువంటి బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ అయిన శ్రీముఖితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఆడియన్స్ "చంద్రిక" సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.



 

మరో కథానాయకి శ్రీముఖి మాట్లాడుతూ... ""చంద్రిక" కథ అనుకొన్నాక మొదట ఒక ట్రయిల్ షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాం. ఆ వీడియోని వచ్చిన రెస్పాన్స్ చూసి.. మా సాజిద్ గారు "చంద్రిక"ను ఫుల్ లెంగ్త్ పిక్చర్ గా తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఆయన సమకూర్చిన కథ, స్క్రీన్ ప్లే ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. చాలా మంది ఈ సినిమా ట్రైలర్ చూసి "చంద్రముఖి లాగ ఉంది" అంటున్నారు. అసలు "చంద్రముఖి"కి మా "చంద్రిక" చిత్రానికి ఏ విషయంలోనూ పోలిక ఉండదు. మా డైరెక్టర్ యోగేష్ హైదరాబాద్ కు చెందినవాడే. కొత్తవాడైనా ఎంతో నేర్పుతో చిత్రాన్ని తెరకెక్కించాడు. పబ్లిసిటీ విషయంలో పెద్ద సినిమాలకు తీసిపోకుండా "చంద్రిక"ను ప్రమోట్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందిచాలని కోరుకొంటున్నాను" అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు  ఇతర ముఖ్యపాత్రలు  పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌!