English | Telugu
ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపు.. ఎవరి మెయిల్ నుంచి వచ్చిందో తెలుసా?
Updated : Oct 15, 2025
ఇటీవలికాలంలో బాంబు బెదిరింపులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ కలకలం ఎక్కువైంది. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసి వారి ఇంటిలో లేదా ఆఫీసుల్లో బాంబులు పెట్టామని బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ బాంబ్ స్వ్యాడ్ రంగంలోకి దిగడం, అది బెదిరింపు మాత్రమే తప్ప బాంబు పెట్టారన్నది వాస్తవం కాదని పోలీసులు తేల్చేస్తున్నారు. ఏదేమైనా తమిళనాడులోని ప్రముఖులకు ఇది ఒక తలనొప్పిగా మారింది. ఈ తరహా వార్తలు వారి అభిమానుల్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నారు. తాజాగా మంగళవారం మరోసారి బాంబు పెట్టామంటూ మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు.
కొన్ని రోజులుగా ప్రముఖుల ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ బాంబులు పెట్టామంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. మంగళవారం చెన్నైలోని రష్యా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, థాయిలాండ్, సింగపూర్ రాయబార కార్యాలయాలకు కొందరు వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ వచ్చాయి. వీరితోపాటు టి.నగర్లో ఉన్న ఇళయరాజా స్టూడియోకి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్తో స్టూడియోకి చేరుకొని తనిఖీలు చేయగా అది ఫేక్ అని తెలిసింది. ఇప్పటివరకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ అన్నీ ఒకే మెయిల్ ద్వారా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
ఇటీవల నటి త్రిష కృష్ణన్, నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ , గవర్నర్ భవనాలకు కూడా ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇదే తరహాలో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల నివాసాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. బాంబు పెట్టామని బెదిరించి, దాన్ని ఫేక్ అని తేల్చడం ద్వారా పోలీసుల్ని తప్పుదోవ పట్టిందుకే ఇలా మెయిల్స్ చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. మెయిల్ పంపిన వారు ఎవరు, ఎక్కడి వారు వంటి సమాచారం కోసం పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన స్టూడియోకి బాంబు బెదిరింపు వచ్చినప్పటికీ ఇళయరాజా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.