English | Telugu
విజయ్ దేవరకొండ మీద జనాలకు జాలి లేదు.. నిర్మాత కామెంట్స్ వైరల్!
Updated : Jul 15, 2025
కొందరి మాటలు ఎప్పుడూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుండి విజయ్ దేవరకొండకు ఈ సమస్య ఉంది. తెలిసీ తెలియకుండా అన్న మాటలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో కూడా రెండు వివాదాలు ఎదురయ్యాయి. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి మాట్లాడుతూ ట్రైబ్ అనే పదం ఉపయోగించగా అది వివాదాస్పదమైంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల స్క్రిప్ట్ ల విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని విజయ్ చెప్పగా.. అది కూడా కాంట్రవర్సీ అయింది. ఓ రకంగా విజయ్ ఏదీ మాట్లాడినా వివాదమే అన్నట్టుగా తయారైంది. ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత నాగవంశీ ప్రస్తావించారు. విజయ్ మీద కొంచెమైనా జాలి చూపించాలని అన్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'కింగ్ డమ్'. ఈ యాక్షన్ డ్రామా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"అసలు విజయ్ గారిని జనం ఎందుకు టార్గెట్ చేస్తారో తెలీదు. పాపం అసలే ఆయన సినిమాలు ఆడక డౌన్ లో ఉన్నారు. రెట్రో ఈవెంట్ లో చిన్న మాట అంటే దాన్ని హంగామా చేశారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకోలా తీసుకున్నారు. అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం?. ఇదివరకు అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడేం మాట్లాడట్లేదు కదా. ఆఫ్ కెమెరా ఆయనసలు చాలా మంచిగా ఉంటారు. జనాలకు అసలు హీరో మీద జాలి కూడా లేదు. ఓ పక్క హిట్లు లేక ఆయన అలా ఉంటే.. ఆయన ఏం మాట్లాడినా భూతద్దంలో చూస్తూ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.