English | Telugu
సోనూ సూద్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు!
Updated : Jan 20, 2024
టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సమస్యలు కూడా వస్తున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్ళు టెక్నాలజీ సాయంతో వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. మనం ప్రతిరోజూ ఈ తరహా మోసాల గురించి వింటూనే ఉన్నాం. ఈమధ్యకాలంలో ఎఐ టెక్నాలజీ బాగా విస్తరించడంతో దాని సాయంతో సెలబ్రిటీల ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి వారిని మానసికంగా హింసిస్తున్నారు. ఆమధ్య రష్మికతో పాటు పలువురు హీరోయిన్ల ఫేక్ వీడియోలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఓ ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ నటుడు సోనూసూద్కి దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విలన్గా కనిపించే సోను.. నిజజీవితంలో రియల్ హీరో అని పేరు తెచ్చుకున్నాడు. లాక్డౌన్ సమయంలో అతను చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే లాక్డౌన్తో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సోను ఫేస్తో ఫేక్ వీడియోను క్రియేట్ చేసి, తద్వారా కొందరు నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. తన ఫేక్ వీడియోతో మోసాలు చేస్తున్న వారి గురించి వివరించేందుకు సోనూ సూద్ స్వయంగా స్పందించాడు. ‘టెక్నాలజీ సాయంతో నా ఫేస్తో ఫేక్ వీడియోను క్రియేట్ చేసి కొందరు మోసాలకు పాల్పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నేను వీడియో కాల్ చేసి అందర్నీ డబ్బులు అడుగుతున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి దీన్ని ఎవరూ నమ్మవద్దు. ఆ మోసగాళ్ళ వలలో చిక్కుకోవద్దు. నా పేరు వాడుకొని డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను’ అంటూ హెచ్చరించారు సోనూ సూద్.
సేవ చేయడంలో, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సోనూ సూద్ ఎప్పుడూ ముందుంటారన్న విషయం మనకు కోవిడ్ టైమ్లో తెలిసింది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న మోసానికి అమాయకులు బలవుతున్నారు. వీడియో కాల్ చేస్తోంది సోనూ సూదేనని నమ్మి డబ్బు పంపిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. అయినా సరే నేరగాళ్ళ వలలో చిక్కుకొని చాలా మంది మోసపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. సోనూసూద్ వంటి వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి అందర్నీ డబ్బులు ఎందుకు అడుగుతాడు అనే చిన్న లాజిక్ను కూడా ఆలోచించకుండా డబ్బు పంపిస్తున్న వారిపై జాలి చూపిస్తున్నారు నెటిజన్లు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని అందర్నీ కోరుతున్నారు.