English | Telugu

కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటి: పిన్నెల్లి 

పల్నాడు లో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ నుంచి 10 కార్లలో బోండా, బుద్ధా వెంకన్న మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించాడని ఎమ్మెల్యే పిన్నెల్లి పెర్కొన్నారు. " మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఒక పిల్లాడికి తగిలింది: దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. వారిని సముదాయించాల్సింది పోయి టీడీపీ నాయకులు బోండా సహా ఇతర నాయకులు దుర్భాషలాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకం," అంటూ పిన్నెల్లి విమర్శించారు.

అందులో భాగంగానే 10 కార్లతో వచ్చి కావాలనే గొడవకు దిగారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది... ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మాచర్ల ఎం ఎల్ ఏ ఆరోపించారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందక్భంగా అంబటి, ముస్తాఫాలపై దాడులు చేసి హతమార్చటానికి కుట్ర పన్నారని పిన్నెల్లి గుర్తుచేసారు.మొన్నటికి మొన్న రైతుల ముసుగులో నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు, అయినా సరే... మేం సంయమనంతో వ్యవహరించామని ఎం ఎల్ ఏ చెప్పుకొచ్చారు. అయినా, అసలు విజయవాడ కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటని ఆయన ప్రశ్నించారు.