English | Telugu

ఈ నెల 31 వరకు తెలంగాణాలో లాక్‌ డౌన్

క‌రోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ఆదివారంనాడు తెలంగాణలో 5 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ లో చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం ప్ర‌క‌టించారు.

వారం రోజులు ఇళ్ల‌లోనే వుండండి. ఆ ఒక వారం మీ జీవితాన్నే కాపాడుతోంది. మీమ్మ‌ల్ని, మీతో పాటు దేశాన్ని కాపాడండని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇట‌లీ లాంటి దుర్గ‌తి మ‌న‌కు ప‌ట్ట‌వ‌ద్దంటే మ‌న‌మే మ‌న‌ల్ని కాపాడుకోవాల‌ని సి.ఎం. సూచించారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారు హోం క్వాంరెంటైన్ లోనే వుండండి. దాచి పెట్ట‌వ‌ద్దు. మీకు మీరు నియంత్ర‌ణ పాటించండి. భ‌యోత్పాత స్థితిలో ప్ర‌పంచం వుంది. ద‌య‌చేసి ఆషామాషీగా తీసుకోకుండా స్వ‌యం నియంత్ర‌ణ‌పాటించండి. మ‌న కుటుంబాన్ని, మ‌న దేశాన్ని మ‌నం ధ్వంసం చేసుకుందామా అంటూ ముఖ్య‌మంత్రి సూచించారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీఎస్‌తో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో భేటీ లో పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ చేజారిపోతుందన్న అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని కేసీఆర్ సర్కార్ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.