English | Telugu

హైకోర్టు వేసిన ప్రశ్నకు ఆర్డినెన్స్ తో జవాబు చెప్పిన కేసీఆర్ సర్కార్

కరోనా దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలలో, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఐతే కొంత మంది పెన్షనర్లు తమ పెన్షన్లలో కోతకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన హైకోర్టు పెన్షన్లలో కోత పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటో తెలపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజుకే తమ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ తాజాగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. విపత్తుల సమయంలో జీతాలు, పెన్షన్లు తగ్గించి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. దీంతో న్యాయస్థానాలతో సహా ఎవరూ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి.

గడిచిన మూడు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇస్తూ వస్తోంది. ఐతే వైద్య సిబ్బంది, పోలీసులకు మాత్రం పూర్తి జీతాలు ఇస్తోంది. మిగిలిన వారందరికీ మాత్రం కోతలు పెడుతోంది. ఐతే పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు రెండు నెలల పాటు సగం జీతాలే ఇచ్చినా...ఈ నెల నుండి పూర్తి జీతాలు ఇస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. కోతలను మరికొంత కాలం కొనసాగించాలని డిసైడ్ అయింది. ఐతే దీనిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికి నేరుగా చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా మెరుగుపడడం తో పాటు మద్యం అమ్మకాలు కూడా ప్రారంభం కావడంతో ప్రభుత్వం శాలరీలు పూర్తిగా ఇస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశల పై ఈ ఆర్డినెన్స్ నీళ్లు చల్లింది.