English | Telugu
స్టాక్ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్లు హాంఫట్!
Updated : Mar 9, 2020
మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండే. ఈ ఒక్కరోజే దాదాపు రూ.6.8 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైపోయింది.
చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో భారత్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం దిశగా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్ల సంపద హరించుకపోయింది.
స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదొక బ్లాక్ మండేగా మిగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, ఒపెక్ మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చాయి. దీంతో చమురు ఆధారిత సంస్థల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. అలాగే యెస్ బ్యాంక్ సంక్షోభంలో సీబీఐ సోదాలు చేపట్టడం.. రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం వంటి పరిణామాలు దేశీయ మదుపర్లను నిరాశకు గురిచేశాయి. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఓ దశలో ఓఎన్జీసీ 15శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 13శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 8.5శాతం, టాటా స్టీల్ 7శాతం నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 4శాతం నష్టాలతో లోహరంగం అత్యధిక నష్టాల్ని మూటగట్టుకుంది.
భారత స్టాక్ మార్కెట్లలో ఇదివరకూ ఎప్పుడూలేని భారీ పతనాన్ని ఇన్వెస్టర్లు ఇప్పుడు చూచిచూశారు.
సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా పతనమైంది.