English | Telugu

కన్నా లక్ష్మీనారాయణను తొలగించింది అందుకేనా..! 

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం కొందరికి ఆశ్చర్యం కలిగించినా.. మరి కొందరు మాత్రం దీనిని ముందే ఊహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ్ని మార్చిన సమయంలో ఇక్కడ కూడా మారుస్తారనే ప్రచారం జోరుగా సాగినా కానీ ఎందుకో అధిష్టానం కొంత కాలం వేచి చూసింది. అయితే హఠాత్తుగా రాత్రికి రాత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా ల‌క్ష్మీనారాయణ ను ఆ పదవి నుండి తప్పించి అయన ప్లేస్ లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను కూర్చోబెట్టారు. ఐతే బీజేపీ అధిష్టానం ఈ సడెన్ నిర్ణయం వెనుక కన్నా ల‌క్ష్మీనారాయణ తీసుకున్నకొన్ని నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. కొన్ని విషయాల్లో బీజేపీ అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చేలా అయన వ్యవహరించారని, మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కేంద్ర పెద్దల‌ను ఆయన ఇరుకున పెట్టారనే గుసగుసలు రాష్ట్ర పార్టీలోనే వినిపిస్తున్నాయి.

తాజాగా మూడు రాజధానుల బిల్లులు గవర్నర్‌కు చేరిన వెంటనే అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కన్నా గవర్నర్‌కు లేఖ రాయడం అధిష్టానానికి ఆగ్రహం కల్గించిందని సమాచారం. దీంతో అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే స్వేచ్చ రాష్ట్ర ప్రభుత్వాల‌కు ఉందని, ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని పార్టీ సీనియర్‌ నేతలు జి.వి.ఎల్‌.నరసింహారావు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్‌ వంటి నేతలు చెబుతున్నా కన్నా పట్టించుకోలేదని అందుకే ఆయనను పక్కన పెట్టారని తెలుస్తోంది.

మరో వైపు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కొంత మంది నాయకుల‌తో కల‌సి ఆయన ఒక గ్రూపుగా ఏర్పడి టీడీపీ విధానాల‌కు అనుగుణంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ కు సంబంధం లేకుండా అయన స్వంతంగా వ్యవహరించారనే కోపం అధిష్టానంలో ఉందంటున్నారు. అదే కాకుండా కేంద్ర స్థాయిలో ప్రతి విషయంలో తమతో సహకరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అయన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కూడా కేంద్రంలోని పెద్దల‌కు నచ్చలేదట. దీనికి తోడు కన్నా, పురంధేశ్వరి, సుజనా మరి కొంత మంది నేతలు కల‌సి టీడీపీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని ఇతర నాయకులు పదే పదే కేంద్ర పెద్దల‌కు ఫిర్యాదు చేయడంతో కన్నా పై వేటు పడిందని సమాచారం.