English | Telugu
రైతులు ఇపుడే గుర్తొచ్చారా సార్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ
Updated : Dec 8, 2020
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆందోళన చేస్తున్న రైతన్నలకు సంఘీభావంగా వివిధ రాజకీయ పక్షాలు ఈరోజు భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడంతో బంద్ ఉధృతంగా జరుగుతోంది. ఈ నేపద్యంలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ బంద్ కు పూర్తి మద్దతు తెలుపుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
దీంట్లో భాగంగా హైదరాబాద్ లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా బంద్ కు మద్దతుగా తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో పోలీసులు కూడా వారికి సహకరిస్తూ బారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నిలిపివేశారు. అయితే ఈ నిరసనతో తీవ్ర ఇబ్బందులకు గురయిన వాహనదారులు, స్థానికులు ఇదేంటని ఎమ్మెల్యే గాంధీని నిలదీశారు. ఇలా తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని... అంతేకాకుండా ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు మీకు ఇప్పుడే కనిపించాయా? అంటూ ఎమ్మెల్యేను ఓ మహిళ గట్టిగా ప్రశ్నించింది. అయితే ఎమ్మెల్యేను నిలదీస్తున్న స్థానికులతో టీఆర్ఎస్ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వచ్చిన ఒక స్థానికుడి పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోయేలా వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ కార్యకర్తలకు, స్థానికులకు సర్ది చెప్పి పంపించివేశారు. దీంతో గొడవ సద్దుమణగడంతో స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోగా టీఆర్ఎస్ నాయకులు తమ నిరసనను కొనసాగించారు.