English | Telugu
గేమ్ ఛేంజర్ పోతే చరణ్ ఫోన్ కూడా చేయలేదు.. వాళ్ళిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది!
Updated : Jul 1, 2025
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారని పేరుంది. సినిమాలకు సంబంధించి ఏ విషయం మీదైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలా అని వివాదాస్పదమయ్యేలా మాట్లాడటం దిల్ రాజు చేయరు. కానీ, ఆయన సోదరుడు శిరీష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దిల్ రాజు తరహాలోనే ఆయన కూడా నిర్మొహమాటంగా మాట్లాడుతున్నప్పటికీ.. కాస్త లైన్ దాటి మాట్లాడటంతో అవి కాంట్రవర్సీ అవుతున్నాయి.
దిల్ రాజు, శిరీష్ నిర్మించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా శిరీష్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.
"గేమ్ ఛేంజర్ తో మా బతుకు అయిపోయిందనుకున్నాం. సంక్రాంతికి వస్తున్నాంతో హోప్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లోనే జీవితం మారింది. అదే రాకపోతే మా పరిస్థితి ఏంటి?. ఇక్కడ ఎవరూ త్యాగాలు చేయరు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. హీరో(రామ్ చరణ్) వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్(శంకర్) వచ్చి హెల్ప్ చేశాడా? కనీసం ఎలా ఉన్నారు ఏంటని కూడా పరామర్శించలేదు. అలా అని మేము ఎవరినీ బ్లేమ్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఇది బిజినెస్. మా ఇష్టంతో సినిమా చేశాం.. నష్టం వచ్చింది. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్స్ వెనక్కి ఇవ్వమని మేము అడగము. మా డిస్ట్రిబ్యూటర్స్ ని మేమే సేవ్ చేసుకుంటాం." అని శిరీష్ చెప్పారు. అయితే శిరీష్ చేసిన ఈ కామెంట్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలకు లాభనష్టాలు సహజం. కానీ, పదే పదే గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడటం ఏంటని ఫైర్ అవుతున్నారు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ పై కూడా శిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టమొస్తే ఆదుకోరని అన్నారు. కానీ సితార సంస్థ నాగవంశీ అలా కాదని.. డిస్ట్రిబ్యూటర్స్ శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడని చెప్పారు. మైత్రికి, నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. మైత్రి నక్క అయితే, నాగవంశీ నాగలోకం అని శిరీష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.