English | Telugu

ఎంఐఎం కార్పొరేట‌ర్ పోలీసులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌! కేసు న‌మోదు!

ఎంఐఎం కార్పోరేటర్ పోలీసు కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగ‌డం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో.. ఎంఐఎం కార్పొరేటర్ ముర్తుజా అలీపై మాదన్నపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.

మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చావ్నీ నదే అలీ బాగ్‌ ప్రాంతంలోని మసీదు వద్ద బందోబస్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంఐఎం కార్పొరేటర్ ముర్తుజా అలీ బెదిరించారు. ఉన్నతాధికారులకు చెప్పి సస్పెండ్ చేయిస్తామన్నారు. కానిస్టేబుళ్లు చేతులతో బ్యాడ్జ్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించగా.. కార్పొరేటర్ వారితో దురుసుగా ప్రవర్తించారు.

పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ముర్తుజా అలీపై కేసు నమోదు చేశామని సంతోష్ నగర్ ఏసీపీ ఎస్వీఎన్ శివరాం శర్మ తెలిపారు.

పోలీసులు మసీదుకు తాళం వేయాలని చెప్పారని కార్పొరేటర్ ఆరోపించారు. మసీదు లాక్ వేయడానికి పర్మిషన్ లెటర్ ఉంటే చూపించామని తాను వారిని అడిగానన్నారు. ఆ ప్రాంతంలో కానిస్టేబుళ్లు ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శుక్ర‌వారం కావ‌డంతో, మ‌సీదుకు తాళం వేయడంతో చావ్నీ నదే అలీ బాగ్ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించారు. బందోబ‌స్తు పెంచారు.