English | Telugu
విజయారెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చింది? నిందితుడు సురేష్ స్టేట్-మెంట్ ఏమిచ్చాడు?
Updated : Nov 6, 2019
తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న నిందితుడు సురేష్ నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు.... ఈ ఘాతుకం వెనుక ఇంకెవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. అయితే, విజయారెడ్డి హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తన తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. తమ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే, రెవెన్యూ అధికారులు మాత్రం ఇతరుల పేరు మీద దస్తావేజులు, పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని, దీనిపై గ్రామసభల్లో అనేకసార్లు ప్రశ్నించామని, అలాగే తమ పేరిట పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్ విజయారెడ్డిని వేడుకున్నానని, కానీ ఆమె పట్టించుకోలేదని, ఆ కోపంతోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశానని పోలీసులకు, మెజిస్ట్రేట్ కు సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
అసలీ భూముల వివాదమేంటో ఒకసారి చూద్దాం... అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో... పలురువు రైతులు.... 1954లో రాజా ఆనందరావు నుంచి భూములు కొనుగోలు చేశారు. అనంతరం కాలంలో ఆర్వోఆర్ చట్టం కింద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. అప్పట్నుంచి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, సాగుదారులుగా కొనసాగుతున్నారు. అయితే, 2014లో సడన్గా తెరపైకి వచ్చిన యాసిన్ అండ్ హయత్ లు.... తమ దగ్గర రక్షిత కౌలుదారుల చట్టం కింద హక్కులు ఉన్నాయంటూ కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో అప్పటివరకు సాగు చేసుకుంటున్న రైతులకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు విచారణ తర్వాత ఆ భూమిపై హయత్-యాసిన్ తోపాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2016 అక్టోబర్ 25న ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆ భూములను వాళ్లు... ఇద్దరు రియల్టర్లకు విక్రయించారు. అయితే, అప్పటివరకు సాగుదారులుగా ఉన్న రైతులు... జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా, ఆర్డీవో ఆదేశాలనే సమర్ధించడంతో... తిరిగి హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉండగా, సర్వే నెంబర్ 87 నుంచి 101 వరకున్న దాదాపు 130 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది.
అయితే, ఈ భూములు హైదరాబాద్కి సమీపంలో ఉండటం... అలాగే, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండటంతో... రాజకీయ నేతలు, కబ్జాదారులు, రియల్టర్ల కన్ను వీటిపై పడింది. దాంతో, ఇటీవల సర్వే నెంబర్ 92, 93, 94, 96ల్లో 40 ఎకరాల భూమిని ఓ రాజకీయ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో... ఆ భూములకు చెందిన 11 కుటుంబాలు హైకోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే... మరోవైపు రెవెన్యూ అధికారులు... లంచాలకు కక్కుర్తిపడి ఇతరుల పేరు మీద దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. ఈ 40 ఎకరాల్లోనే నిందితుడు సురేష్, అతని పెదనాన్నకు 8 ఎకరాల భూమి కూడా ఉండటంతో.... స్థానిక తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తాను కలుగజేసుకోలేనని విజయారెడ్డి చెప్పింది. కానీ, ఆ భూములకు ఇతరుల పేరు పట్టాలివ్వడంతోపాటు దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బాధిత రైతులు గ్రామ సభల్లో నిలదీయడమే కాకుండా, అనేకసార్లు గొడవకి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా, ఇతరుల పేరు మీద పట్టాలు ఇవ్వడంతో బాధిత రైతులు రగిలిపోయారు. ఆ బాధిత కుటుంబాల్లో ఒకడైన సురేష్... తహశీల్దార్ విజయారెడ్డి ఉండగా... ఆ భూములు ఇక తమకు దక్కవేమోనన్న ఆందోళనతో... పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.