English | Telugu

చిరిగిన బట్టలతోనే ఉద్యమం చేయాలా? అమరావతికే తన మద్దతన్న పవన్

అమరావతి ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి ఉద్యమకారులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బంగారం నగలు ధరించి ఉద్యమం చేయకూడదా? అని జనసేనాని నిలదీశారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా? అని ప్రశ్నించారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

అమరావతి పరిరక్షణ సమితి నేతలతో మరోసారి సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని తనకు బీజేపీ స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తమ పార్టీ కార్యాచరణ వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.