English | Telugu

కామాఖ్యదేవికి మూడు బంగారు కలశాలు.. 20 కిలోలు విరాళమిచ్చిన అంబానీ దంపతులు 

అసోంలోని నీలాచల కొండల్లో కొలువైన కామాఖ్య దేవి ఆలయానికి 20కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు ముకేష్ అంబానీ దంపతులు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవికి బంగారం విరాళం ఇస్తామని మూడు నెలల కిందే అంబానీ దంపతులు ప్రకటించారు. ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు తాము భరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున బంగారం అందించగా, ఆలయ కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

కలశాల నిర్మాణ పనుల్లో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన అర్ధాంగి నీతా అంబానీ అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ప్రముఖమైన కామాఖ్య ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.