English | Telugu

ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు మొదలైనట్లా, కానట్లా?

ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ముగియనుండగా, ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే, ఆర్టీసీ మాత్రం ఇంకాకొక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. 15 వ తేదీనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడుస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

లాక్ డౌన్ ను తొలగిస్తూ, కేంద్రం నిర్ణయిస్తే, 15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని చెప్పిన ఇండియన్ రైల్వేస్, ఇప్పటికే బుకింగ్స్ ను స్వీకరించడం ప్రారంభించాయి. ఇక, ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీ బస్సులకు మాత్రం ఇంకా రిజర్వేషన్ మొదలు కాలేదు. ఏసీ బస్ లను ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపించక పోవచ్చన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు 15 నుంచి బుకింగ్స్ ఇప్పటికే మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, కాల్ సెంటర్ మాత్రం ఇంకా ఈ విషయమై ఏ రకంగానూ స్పందించటం లేదు.