English | Telugu

సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న మహిళా రైతుకు కష్టాలు!

ఆమె ఓ వితంతువు, భర్త లేకపోయినా కష్టాలకు ఎదురెళ్లి ధైర్యంగా వ్యవసాయం చేస్తోంది. ఉత్తమ మహిళా రైతుగా అవార్డు అందుకుంది. అలాంటి మహిళకు ఇవాళ అంతులేని కష్టం వచ్చింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కర్ర పని గూడెంలో కర్ర శశికళకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. భర్త మరణంతో ఆమె వ్యవసాయంలోకి అడుగుపెట్టింది. మొదట వ్యవసాయంలో ఇబ్బందులు తలెత్తాయి. గ్రామస్తులు, స్థానికులు ఆమెను అవమానించారు.. నిరుత్సాహపరిచారు.. అయినా ఎక్కడ బెదరకుండా అద్భుతాలు సృష్టించింది. ఉత్తమ మహిళా రైతుగా ఎదిగి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంది.

అనేక విజయాలు సాధించిన ఆమె ఇవాళ ఓ ఇటుకబట్టీ వ్యాపారి నిర్వాకం వల్ల తన వ్యవసాయ క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని మదనపడుతోంది. ఓ వ్యాపారి ఎలాంటి అనుమతులూ లేకుండా శశికళ వ్యవసాయ క్షేత్రం పక్కనే 30 ఎకరాలు లీజుకు తీసుకొని అక్రమంగా ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం పై ఆమె పొల్యూషన్ ఫైర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా అతనికే సహకరించారు. ఇటుకబట్టీకి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయించారు. బట్టి వల్ల బూడిద నిప్పు రవ్వలు పొలల్లో పడుతున్నాయని శశికళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గడ్డివాము.. గోశాల.. మీద నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశముందని వాపోతుంది. పాలిహౌస్, నర్సరీ చెట్ల మీద బూడిద పడి చెట్లు చనిపోతున్నాయని చెబుతోంది. వెంటనే బట్టి మూసివేయించాలని లేకపోతే తాను వ్యవసాయ క్షేత్రం వదిలిపెట్టే పరిస్థితి వస్తుందని ఆదర్శ మహిళా రైతు కన్నీటి పర్యంతమవుతుంది. మహిళా సాధికారత కోసం అండగా ఉంటామంటూ ఊగిపోయే.. ఊదరగొట్టే.. ప్రభుత్వం శశికళ లాంటి మహిళలకు ప్రోత్సాహం అందిస్తే చాలని స్థానికులు అంటున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి బట్టి వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.