English | Telugu
కర్నూలు జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు
Updated : Apr 4, 2020
మొత్తం 449 సాంపిల్స్ టెస్టింగ్ కు పంపగా, అందులో ఢిల్లీ జమాత్ కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్ 338 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిన్న రాత్రి , ఈ రోజు ఉదయం అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్ ల నుండి 90 రిపోర్టులు వచ్చాయని, ఈ రోజు సాయంత్రం మరిన్ని రిపోర్టులు వస్తాయి.. రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం అన్నారు.
ప్రజలు ఆందోళన చెందకుండా..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించండని కలెక్టర్ వీరపాండియన్ కోరారు.
కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో..కర్నూలు రోజా వీధి చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్, అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించాం అని కలెక్టర్ చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి..వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమీషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపిడిఓ లకు ఆదేశాలను ఇచ్చినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం.. ఆ ప్రాంతమంతా క్రిమి సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి... ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి...కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్, తహశీల్దార్, ఎంపిడిఓ లకు సమాచారం ఇవ్వండి అని కలెక్టర్ కోరారు.
కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు అన్నారు.
కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం అని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు.