English | Telugu

ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో బిజెపి మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి మ‌రో కేసులో తీర్పు వెలువడింది. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌‌కు న్యాయస్థానం శిక్ష ఖరారుచేసింది. ఈ కేసులో సెంగార్‌తోపాటు మరో ఏడుగుర్ని ఢిల్లీ న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. దోషులకు శిక్షలు ఖరారుచేసిన న్యాయస్థానం జరిమానా కూడా విధించింది. ఈ కేసులో సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మిగతా దోషులకు పదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా అత్యాచారం కేసులో ఇప్పటికే సెంగార్‌‌కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే.

బాధితుడిపై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టి, పోలీసులతో అరెస్ట్ చేయించారనడానికి విచారణలో పక్కగా సాక్ష్యాలు విచారణలో లభ్యమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిని చంపాలని ఉద్దేశం నిందితుడికి లేకపోయినా, కానీ, అతడిపై దారుణంగా దాడిచేసి అతడి మరణానికి కారకులయ్యారని పేర్కొంది. పోలీసులు కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యంత పాశవికంగా కొట్టారు.. వైద్యులు కూడా మానవత్వం లేని మనుషుల్లా నిర్లక్ష్యం వహించారని న్యాయమూర్తి మండిపడ్డారు.

గతేడాది జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. రాయ్‌బరేలీలోని కోర్టకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై ఐదుగురు దాడిచేశారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనానికి యత్నించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం తొలుత స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించగా, పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 40 గంటలు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.