English | Telugu

సి.ఎం గారు! రాజప్రాసాదం దాటి ప్ర‌జ‌ల్లోకి రాలేరా?

క‌రోనా దెబ్బ‌కు తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ ను వ‌దిలి పెట్టి, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకొని పాల‌న చేస్తున్నారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మాత్రం తాడేప‌ల్లిలో తాను నిర్మించుకున్న రాజ‌భ‌వ‌నం అదే సి.ఎం.క్యాంప్ ఆఫీస్ వ‌దిలి ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదని తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తూ ట్వీట్‌లు పెడుతోంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే రాజప్రాసాదంలో కూర్చుని పాలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకులు, కింజరాపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

65 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్ లో పని చేస్తున్నారు.

65 ఏళ్ళ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్రస్థాయిలో ఉన్నారు.

63 ఏళ్ళ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహాయక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్నారు.

58 ఏళ్ళ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ క్షేత్రస్థాయిలో కరోనా నివారణ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

61 ఏళ్ళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.

మేఘాలయా ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గ్రౌండ్ లో పని చేస్తున్నారు.

77 ఏళ్ళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారు.

అయితే యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదం దాటి ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేదు. ప్ర‌జ‌ల గోడు మీకు ప‌ట్ట‌దా? బయటకు రారా? రాజకీయమే ముఖ్యమా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.