English | Telugu
చిరంజీవితో రఘువీరా భేటీ
Updated : Mar 3, 2020
వీరి కలయిక పార్టీకి జీవం పోస్తుందా?
ఆంధ్రాలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయా?
పార్టీలో గుసగుసలు
ఇప్పుడు ఇదే పిక్చర్ ఆఫ్ ఆంధ్రా
రఘువీరారెడ్డి చిరంజీవిని కలవడానికి కుటంబసమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ఎందుకంటారా ఆయన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో 52 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మే 29న జరగనుంది.
ఒకప్పుడు రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. ఇప్పుడు పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు.
చిరంజీవి కూడా అంతేగా. కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు.
ఇలాంటి ఇద్దరు నేతలు.. హైదరాబాద్లో కలవడం విశేషమేగా మరి. అవును. అలాంటి సందర్భమే అందరినీ ఆకర్షిస్తోంది.
చిరంజీవి ఆ కార్యక్రమానికి వెళ్తారా, లేదా అన్న అంశం కంటే చిరు, రఘువీరా కలయిక మాత్రం.. రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకునే అవకాశమైతే లేకుండా ఉండవని.. ఇద్దరి మధ్యా ఈ దిశగా ఏ విషయం చర్చకు వచ్చి ఉంటుందా అని.. అంతా అనుకుంటున్నారు. కలర్ ఫుల్ గా ఉన్న వీరి పిక్చర్ ను కాంగ్రెస్ అభిమానులైతే ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వీరి కలయిక జీవం పోస్తుందా? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో మళ్లీ మంచి రోజులు వస్తాయా? పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.