English | Telugu

రాప్తాడులో ఉద్రిక్తత.. పరిటాల రవి పేరుతో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేరూరు డ్యామ్ దగ్గర మాజీ సీఎం చంద్రబాబు, దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెరూరికి టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారపార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శిలా ఫలకాలను ధ్వంసం చేయడంపై సునీత, శ్రీరామ్‌లు మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని సునీత మండిపడ్డారు. కక్షపూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానేనన్నారు. గతంలో పేరూరు డ్యామ్ కు రూ. 804 కోట్లు కేటాయించామని సునీత చెప్పారు.