English | Telugu
ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు!
Updated : Mar 24, 2020
కరోనా పట్ల అప్రమత్తంగా వుండండి! నిర్లక్ష్యం వద్దంటున్న కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి కరోనా వైరస్కు సంబంధించి స్క్రీనింగ్ చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. 37 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 69వేల 436 మందిని హౌస్ క్వారంటైన్ చేశామన్నారు. 20,707 మంది శాంపిల్స్ టెస్ట్ చేశామని వివరించారు.
ల్యాబ్ల సంఖ్యను 118కి పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్రం ఖర్చుతో 48 దేశాల నుంచి 2040 మంది భారీతీయులను తీసుకొచ్చామన్నారు.
కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా రాదనుకునే భావన ఎవరిలో ఉండొద్దని హెచ్చరించారు. కరోనా వైరస్కు ధనిక, పేద, గ్రామం, నగరం అనే తేడా ఏమీ లేదని, ముందస్తు జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని చెప్పారు.