English | Telugu

హైకోర్టు జడ్జిలపై అసభ్యకర కామెంట్స్.. ఎట్టకేలకు రంగంలోకి దిగిన సీబీఐ 

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వీరిలో కొందరి పై సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా సీబీఐ రంగంలోకి దిగి.. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. ఈ వ్యవహారంపై త్వరలో సీబీఐ నిందితులను విచారించే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన 17 మందిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించాలంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ విశాఖలో తాజాగా 12 కేసులను రిజిస్టర్ చేసింది. ఈ కేసుల్లో డి. కొండారెడ్డి, ఎ.మణి, గౌతమీ, పి.సుధీర్, ఆదర్శరెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, ఎ.శ్రీధర్ రెడ్డి, జె.వెంకట సత్యనారాయణ. జి. శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందూరెడ్డి, శ్రీనాధ్, డి.కిషోర్ రెడ్డి, చిరంజీవి, ఎల్. రాజశేఖర్ రెడ్డిల పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.