English | Telugu
వివేకా హంతకుల వెనుక బళ్లారి బడా బాబుల ప్రమేయం ఉందా?
Updated : Mar 11, 2020
* ఉందనే అంటున్న సీనియర్ పోలీస్ అధికారి
* అందుకేనా, వివేకా కుమార్తె ఈ కేసును సి బి ఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు ?
ఆయన తండ్రి హెలికాఫ్టర్ ప్రమాదం లో దుర్మరణం పాలయ్యారు. ఈమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు సంఘటనలు ఆ రెండు కుటుంబాలను తీవ్రంగాకలిచి వేశాయి. కాకపొతే, పినతండ్రి హత్యకు గురికావటం తో ఇప్పుడు, ఆ అన్నా చెలెళ్ల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారం గా ఇప్పటి వరకూ అందరూ భావిస్తూ ఉండి ఉండవచ్చు కాక. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. నిన్న హైకోర్టు ఈ వ్యవహారాన్ని సి బి ఐ కి అప్పగించిన తర్వాత, ఇందులో అంతర్ రాష్ట్ర నేరగాళ్ల ప్రమేయం అనివార్యంగా బయటపడుతుంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం బట్టి, ఆ నేరగాళ్లు పక్క రాష్ట్రం కర్ణాటక లోని బళ్లారి, దాని చుట్టు పక్కల ప్రాంతాల వారని తెలుస్తోంది. ఇదే విషాయాన్ని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లోని ఒక సీనియర్ మోస్ట్ అధికారి తన ప్రయివేట్ సంభాషణల్లో ధృవీకరిస్తున్నారు. కానీ, ' సిట్ ' కాళ్ళూ, చేతులూ కొట్టిపడేయటం వల్ల ...రాష్ట్ర పోలీసు నోరు మెదపటం లేదు. సి బి ఐ చేతికి వెళ్ళింది కాబట్టి ఆ బళ్లారి బడా బాబు ల వ్యవహారమేమిటో బయటకు వస్తుందని ఆ అధికారే స్వయంగా చెపుతున్నారు.
ఆయన గుండె పోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు? ఆయన హత్యకు గురైన విషయాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా కొంతసేపు మరుగునపెట్టారు? ఏడాది దాటినా 'సిట్ ' ఎందుకు ప్రోగ్రెస్ చూపలేకపోయింది? ఈ అంశాలన్నింటి మీద ఇప్పుడు సి బి ఐ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య కేసును, ఎట్టకేలకు సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టించింది. గత 11 నెలలుగా దానిపై సిట్ చేస్తున్న విచారణలో పస లేదని హైకోర్టు నమ్మినందుకే, కేసును సీబీఐకి ఇచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న, నాటి విపక్ష నేత -నేటి సీఎం జగన్.. ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నప్పటికీ.. కోర్టు మాత్రం, నాటి జగన్ వాదనను నెరవేర్చినట్లే భావించాల్సి ఉంది. జగన్ సీఎం అయిన తర్వాత, పిటిషన్ను వెనక్కి తీసుకుంటానని చెప్పిన తర్వాతనే, విపక్షాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం, అందులో రంధ్రాన్వేషణ చేయడం ప్రస్తావనార్హం. అయితే, ఇప్పుడు ఇదే విషయమై -వివేకా కుమార్తెకు, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులకు మధ్య కొన్ని వాద ప్రతివాదాలు జరిగినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసును పులివెందుల పోలీసుస్టేషన్ నుంచే ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశం వల్ల, స్థానిక పోలీసులు చిక్కుల్లో పడక తప్పదు. కాకపోతే.. ఈ హత్య కేసులో అసలు సాక్ష్యాలే కనిపించడం లేదు. సంఘటనాస్థలంలో ఉన్న సాక్ష్యాలను అప్పుడే సమాధి చేశారు. ఒక కీలక వ్యక్తి మృతి చెందాడు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు బదిలీ అయ్యారు. కాబట్టి, సీబీఐ ఈ కేసులో ఏమి సాధిస్తుంది? ఏమి తేలుస్తుందన్న సందేహం రావడం సహజం. తొలుత వైసీపీ అధికార మీడియాలో సహజ మరణం, తర్వాత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ హత్య కేసులో.. పోలీసులు నిర్భయంగా ముందుకు వచ్చి, సీబీఐ ముందు పెదవి విప్పుతారనుకోలేం. ఎందుకంటే పులివెందుల ప్రత్యేకత అది.
వివేకా భార్య, కూతురు, ఇద్దరు రాజకీయ పార్టీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్పై, హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజంగా అధికార పార్టీకి సంకటమే. తన కుమారుడే సీఎంగా ఉన్నప్పటికీ, ఆయన సర్కారు సాగిస్తున్న విచారణపై నమ్మకం లేని పిన్ని, చెల్లి.. కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన వైనం, విపక్షాలకు బోలెడు బలమిచ్చినట్టయింది. దానితో కుటుంబసభ్యులనే నమ్మించలేని జగన్, రాష్ట్ర ప్రజలను ఎలా నమ్మిస్తారని వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించడానికీ కారణమయింది. విపక్ష నేతగా ఉన్న జగన్, తన చిన్నాన్న హత్యపై ఎన్నికల ముందు హడావిడి చేసి, చివరకు సీఎం అయిన తర్వాత తాను కోరినట్లుగానే, కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదన్న విపక్షాల ప్రశ్నకు, అధికార పార్టీ నుంచి జవాబు లేకపోయింది. దీనితో ఎన్నికల ముందు, తన చిన్నాన్న హత్యను జగన్ రాజకీయ లబ్థికి వాడుకున్నారన్న విమర్శలకు తెరలేచినట్టయింది.
ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో, అధికారులు ఏ కోణంలో విచారణ ప్రారంభిస్తారన్న ఉత్కంఠ మొదలయింది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉన్నట్లు, హైకోర్టు అనుమానించడమే దానికి కారణం. తొలుత గుండెపోటు, సహజ మరణంగా ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత ఫొరెన్సిక్ రిపోర్టులో ఆయన ఒంటిపై ఏడుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు, తలలో రెండు వైపులా పొడిచిన దెబ్బలు, ఛాతీ, చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. పైగా చనిపోయిన వ్యక్తి శరీరానికి కుట్లు ఎందుకు వేశారని, వివేకా కూతురు ప్రశ్నించారు. ఆయన దారుణ హత్యకు గురైతే, తొలుత గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారని కూడా, ఆమె అనుమానం వ్యక్తం చేయడం బట్టి.. ఈ కేసులో కుటుంబభ్యులు, పీ.ఏ కృష్ణారెడ్డి, అనుచరుల ప్రమేయాన్ని సీబీఐ తేల్చాల్సి ఉంది. అదేవిధంగా, ఇప్పటివరకూ పోలీసులు విచారించని వ్యక్తులు, కుటుంబసభ్యులను కూడా విచారించవలసి ఉంది.ప్రధానంగా, మృతి వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన వారిని విచారిస్తే తప్ప, కేసు అడుగుముందుకు పడదంటున్నారు. మరి, ఇందులో ఉన్న రాజకీయ, ఆర్ధిక, కుటుంబ కోణాలను సీబీఐ ఏవిధంగా విచారిస్తుందో చూడాలి.