English | Telugu

భారత్-చైనా సరిహద్దులో కూలిన బ్రిడ్జ్​

భారత్- చైనా సరిహద్దులో ఓ వంతెన కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని పితోర్గఢ్ జిల్లాలో.. భారీ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ.. బ్రిడ్జ్ దాటే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లిలాం జోహార్ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఆ నిర్మాణ యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వంతెన కూలిపోయింది. అయితే, వంతెన కూలిపోవడం వల్ల సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికి పైగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.