English | Telugu
నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధాని.. ఏపీకి మూడా?
Updated : Aug 11, 2020
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. ఏపీ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని రామ్ మాధవ్ ప్రశ్నించారు.
ఈ అంశంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్ర పరిధి అంశాలపై టీడీపీ ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో, ఇప్పుడుకూడా అలానే ఉందన్నారు. అంటే దీనర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని, ఇప్పుడు మూడు రాజధానులనేవి అవినీతికి నిలయం కాకుండా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు.
కాగా, ఒకవైపు కేంద్రం కలగజేసుకోదు అని చెప్తూ, అమరావతికి మద్దతుగా పార్టీ తీరుని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తూ.. మరోవైపు పార్టీ పరంగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం అన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడటం విమర్శలకు దారితీస్తోంది. ఇలా రెండు పడవల మీద కాలేస్తూ ఏపీలో పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.